అక్కడ రాత్రిపూట ప్రయాణాలు బంద్! నేటి నుంచే కఠిన ఆంక్షలు..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోరు క్లైమాక్స్కు చేరుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తిన తొలిదశ ఎన్నికల ప్రచారానికి నేడు సాయంత్రం 6 గంటలతో ఎండ్ కార్డ్ పడింది. దీంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో హింసను నిరోధించడానికి, ఓటర్లను బెదిరింపులకు గురికాకుండా చూడటానికి మోటార్ సైకిళ్ల కదలికలపై కఠిన ఆంక్షలు విధించారు. తక్షణమే అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు కొనసాగుతాయి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
బైక్ ర్యాలీలకు నో పర్మిషన్!
పోలింగ్కు సరిగ్గా రెండు రోజుల ముందు నుంచే ఎటువంటి మోటార్సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు అక్రమంగా గుమిగూడకుండా, ఓటర్లను భయాందోళనలకు గురిచేయకుండా ఉండటమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాల ఎన్నికల అధికారులు (DEOలు), పోలీసు కమీషనర్లు ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.

రాత్రి వేళ ప్రయాణాలపై ఆంక్షలు..
ముఖ్యంగా రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మోటార్సైకిళ్ల కదలికలపై పూర్తి నిషేధం విధించారు. ఈ సమయంలో ఎవరూ రోడ్లపైకి రాకూడదు. అయితే, వైద్య అత్యవసరాలు లేదా అనివార్యమైన కుటుంబ అత్యవసర పరిస్థితులు ఉంటేనే మినహాయింపు ఉంటుంది. మినహాయింపు కోరుకునే వారు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ముందస్తు రాతపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
పిలియన్ రైడింగ్పై నిఘా (పగటి వేళ)..
పోలింగ్కు ముందు రోజుల్లో (ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు) బైక్పై వెనుక కూర్చుని ప్రయాణించడం (Pillion Riding) నిషిద్ధం. కేవలం స్కూలు పిల్లల రవాణా, కుటుంబ అవసరాలు, మెడికల్ ఎమర్జెన్సీలకు మాత్రమే వెసులుబాటు ఇచ్చారు. అయితే, పోలింగ్ రోజున మాత్రం ఓటు వేయడానికి వెళ్లే కుటుంబ సభ్యులకు ఈ నిబంధన నుంచి కొంత సడలింపు ఇచ్చారు.
ఎన్నికల షెడ్యూల్ గుర్తుంచుకోండి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్నాయి:
- తొలి దశ: ఏప్రిల్ 23, 2026
- రెండో దశ: ఏప్రిల్ 29, 2026
- ఫలితాలు: మే 4, 2026
ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ నిర్వహించేందుకు ఓటర్లు సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.












Click it and Unblock the Notifications