Nandigram: మమతాకు బిగ్ షాక్..సువేందు లీడ్: పంతానికి పోయి: పార్టీ ఆధిక్యతలో ఉన్నా
కోల్కత: పశ్చిమ బెంగాల్లో హాట్ సీట్గా మారిన అసెంబ్లీ నియోజకవర్గం- నందిగ్రామ్. స్టార్ వార్స్గా నిలిచిన స్థానం ఇది. తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన నియోజకవర్గం కావడం ఒక ఎత్తయితే.. బీజేపీ తరఫున పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తన మంత్రివర్గ మాజీ సహచరుడు సువేందు అధికారిని ఢీ కొట్టడం మరో ఎత్తు. దేశవ్యాప్తంగా ఉత్కంఠతకు గురి చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గం ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ను నిరాశకు గురి చేస్తోన్నాయి. మమతా బెనర్జీ.. అక్కడ వెనుకంజలో ఉన్నారు. 2,000 ఓట్లకు పైగా తేడాతో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
Recommended Video
నిజానికి- నందిగ్రామ్ నియోకవర్గం తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట. 2016 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ తరఫున సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేసి, ఘన విజయాన్ని సాధించారు. తృణమూల్లో నంబర్ టూగా ఎదిగారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు- ఆయన పార్టీని వీడారు. బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అదే నందిగ్రామ్ నుంచీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సువేందు అధికారి- ఎన్నికల ముంగిట్లో తనకు వెన్నుపోటు పొడిచారని భావించిన మమతా బెనర్జీ ఏకంగా ఆయనపైనే పోటీకి దిగారు.
సువేందు అధికారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వబోనని శపథం చేశారు మమతా. తనకు అచ్చొచ్చిన భవానీపురా స్థానాన్ని వదులుకుని మరీ.. నందిగ్రామ్లో తలపడ్డారు. సువేందుపై పోటీ చేశారు. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. నందిగ్రామ్ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం సువేందు అధికారి వైపు టర్న్ అయినట్లు ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనాలు నిజం అయ్యేలా కనిపిస్తోంది. ఆధిక్యత స్వల్పమే అయినప్పటికీ- సువేందు అధికారికి అనుకూలంగా ఓటింగ్ సాగిందనే వార్తలు తృణమూల్కు మింగుడు పడట్లేదు. సాక్షాత్తూ మమతా బెనర్జీనే పోటీకి దిగినప్పటికీ.. అక్కడి ఓటర్లు సువేందు అధికారికే ఓటు వేసినట్టు కనిపిస్తోంది.