బెంగాల్ విన్ ద మ్యాచ్..దేశాన్ని కాపాడినందుకు సెల్యూట్..బీజేపీ డర్టీ పాలిటిక్స్కి చెక్..దీదీ విన్నింగ్ స్పీచ్
'బెంగాల్ విన్ ద మ్యాచ్... మేము ఘనవిజయం సాధించాం... బీజేపీ డర్టీ పాలిటిక్స్,చీప్ ట్రిక్స్ ఎన్నికల్లో పనిచేయలేదు...' అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. ముచ్చటగా మూడోసారి బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న మమత... ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైతే తమ ఫోకస్ అంతా కోవిడ్ పైనే అని స్పష్టం చేశారు. కాబట్టి టీఎంసీ శ్రేణులు సంబరాలు పక్కనపెట్టాలని... ప్రస్తుత పరిస్థితుల్లో కొంత త్యాగం చేయక తప్పదని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగిన తర్వాత విక్టరీ వేడుకలు చేసుకుందామని విజ్ఞప్తి చేశారు.
బెంగాల్ ప్రజలకు సెల్యూట్.. దేశాన్ని కాపాడారు...
'ప్రమాణ స్వీకారం చాలా చిన్న వ్యవహారం... ఇంతటి విజయాన్ని అందించిన బెంగాల్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా... అలాగే దేశప్రజలందరికీ సెల్యూట్... ఇవాళ బెంగాల్ యావత్ దేశాన్ని కాపాడింది... అందుకు నేను గర్వపడుతున్నా... ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ... ఇప్పుడు కోవిడ్పై పోరాటానికే మా ప్రాధాన్యత...' అని మమత బెనర్జీ స్పష్టం చేశారు. అంతా కలిసి కోవిడ్పై పోరాటాన్ని కొనసాగిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని... ఇందుకోసం మహా అయితే రూ.30వేల కోట్లు ఖర్చు అవుతాయన్నారు. దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ కోసం తాను పోరాటం చేస్తానని తెలిపారు.
సుప్రీం కోర్టుకు వెళ్తాం... : మమతా బెనర్జీ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డర్టీ పాలిటిక్స్,చీప్ ట్రిక్స్ను ప్రజలు తిరస్కరించారని మమత పేర్కొన్నారు. అధికార యంత్రాంగం మొత్తాన్ని తమకు వ్యతిరేకంగా ప్రయోగించినా బీజేపీ కుయుక్తులు పనిచేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ తమను తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. ఎన్నికలను పూర్తిగా పక్షపాత వైఖరితో నిర్వహించారని... దీనిపై కచ్చితంగా సుప్రీం కోర్టుకు వెళ్తామని మమత చెప్పారు. ఎన్నికల కమిషన్ ఇలా కేంద్రానికి అనుకూలంగా పనిచేస్తే ఇక ప్రజాస్వామ్యం అన్న మాటే ఉండదన్నారు. ఈ విషయంలో దేశంలోని మిగతా పార్టీలను కలుపుకుని వెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు.
నందిగ్రాం ఓటమిపై...
టీఎంసీకి ఘన విజయం కట్టబెట్టిన ప్రజలకు,పార్టీ కోసం పనిచేసిన ప్రతీ కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు చెబుతున్నట్లు మమత తెలిపారు. ఇక నందిగ్రాం గురించి ప్రస్తావిస్తూ... 'నందిగ్రాం గురించి పెద్దగా బాధపడకండి... ఇట్స్ ఓకె... నందిగ్రాం ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వనివ్వండి... ఏ తీర్పునైనా నేను అంగీకరిస్తాను... దాని గురించి నేను పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో మేము మొత్తం 221 స్థానాల్లో గెలిచాం... అంతిమంగా బీజేపీ ఎన్నికల్లో మట్టికరిచింది..' అని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ ఉన్న ట్రెండ్స్ ప్రకారం... మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో టీఎంసీ 218 పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 78 పైచిలుకు స్థానాలకే పరిమితమైంది. బీజేపీ ఎన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించినా బెంగాల్ గడ్డపై మళ్లీ దీదీ జెండానే ఎగరడం గమనార్హం.