టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి అశోక్ దిండాపై రాళ్ల దాడి: టీఎంసీ పనేనంటూ ఆరోపణ
కోల్కతా: టీమిండియా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ దిండా కారుపై ఈస్ట్ మిడ్నాపూర్లో దుండగుల గుంపు దాడికి తెగబడింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మొయినా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న అశోక్ దిండా.. లక్ష్యగా మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు.
మొయినా జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. అతను వెళ్తున్న కారుపై సుమారు 50 మంది రాళ్లు రువ్వారు. ఈ దాడిలో దిండాకు తీవ్ర గాయాలయ్యాయి. దిండాపై దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు.
ఓడిపోతామనే భయంతోనే టీఎంసీ గూండాలు దాడులకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అధికార టీఎంసీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నారు. పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి.
West Bengal: Former cricketer and BJP candidate from Moyna, Ashok Dinda attacked by unidentified people in Moyna. Details awaited. pic.twitter.com/wxu6mT335v
— ANI (@ANI) March 30, 2021
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టాలని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగా ప్రయత్నిస్తుండగా.. తొలిసారి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అందుకే, రాష్ట్రంలో నువ్వానేనా అన్నట్లుగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. తమదే అధికారం అంటూ రెండు పార్టీల నాయకులు చెప్పుకుంటున్నారు.
మార్చి 27 రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 దశల్లో జరుగనున్నాయి. రెండో దశ ఎన్నికలు ఏప్రిల్ 1న జరుగనున్నాయి. దీంతో నేతలు ఎన్నికలు జరుగనున్న ప్రాంతాల్లో ప్రచారాన్ని ముగించారు. ఈ దశలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తలపడుతున్న నందిగ్రాం నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగనున్నాయి.