పశ్చిమబెంగాల్లో జులై 31 వరకు లాక్డౌన్: మమత కీలక నిర్ణయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్డౌన్ను పొడిగించాలని సీఎం మమతా బెనర్జీ నిర్ణయించారు. ఈ మేరకు జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని సడలింపులతో కూడిన లాక్ డౌన్ను మరోసారి పొడిగిస్తున్నట్లు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో 14 వేలకు పైగా కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడి చర్యలపై పార్టీల నేతలతో చర్చించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం మమతా బెనర్జీ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తూనే ఉందనీ, అందుకే జులై 31 వరకు ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించామని సీఎం మమతా తెలిపారు. కరోనా కారణంగా సాధారణ రోగులు వైద్య సేవలు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కూడా మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులు సేవా దృక్పథంతో పనిచేయాలని సీఎం మమతా కోరారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ జులై నెలాఖరు వరకు మూసే ఉంటాయని విద్యాశాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 15,173 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 591 మంది మరణించారు. 4880 యాక్టివ్ కేసులున్నాయి. 9702 మంది కోలుకున్నారు. బుధవారం కొత్తగా 445 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 484 మంది కోలుకున్నారు. 11 మంది మరణించారు.












Click it and Unblock the Notifications