బెంగాల్ లో కొత్త చరిత్ర- పెరిగిన ఓటింగ్ వెనుక, కోటలకు బీటలు..!!
పశ్చిమ బెంగాల్లో ఓటర్లు పోటెత్తారు. మహిళలు.. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొ న్నారు. తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 92.72 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో ఇంత భారీస్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావటం ఇదే ప్రథమం. కాగా.. ఈ స్థాయిలో పోలింగ్ జరగటం బీజేపీ- టీఎంసీలో టెన్షన్ పెంచుతున్నా.. పైకి ధీమాగా కనిపిస్తున్నారు. ఇక.. ఓటింగ్ సరళి ఏంటనేది ఇప్పటికే స్పష్టం అయింది.
పశ్చిమ బెంగాల్ లో మొత్తం 294 శాసనసభ నియోజక వర్గాలకు గాను తొలిదశలో 152 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 16 జిల్లాల పరిధిలో జరిగిన ఎన్నికలకు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇంత మొత్తంలో పోలింగ్ జరగటంతో తమకు అనుకూల సంకేతమని, వరుసగా నాలుగోసారి అధికారం తమదేనని తృణమూల్ కాంగ్రెస్ అధినాయకులు, సీఎం మమ తా బెనర్జీ ప్రకటించగా.. రాష్ట్రంలో ఈసారి మార్పు తథ్యమని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

బీజేపీ మహిళలకు ఇచ్చిన ప్రతీ నెలా రూ 3 వేల రూపాయాల నగదు హామీ వర్కవుట్ అయినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, కొంత కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మమతకు మద్దతుగా ఈ స్థాయిలో పోలింగ్ జరిగిందని టీఎంసీ నేతలు విశ్లేషిస్తున్నారు.
అయితే, ఎన్నికల షెడ్యూల్ సమయం నుంచి ఈ రెండు పార్టీల మధ్య హోరా హోరీగానే పోరు కొనసాగింది. ఇప్పుడు తొలి విడత పోలింగ్ పూర్తవుతున్న సమయంలోనే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో ఈ స్థాయి ఓటింగ్ తమకు కలిసి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. మే 4న టీఎంసీ జంగిల్ రాజ్ అంతం అవుతుందని ధీమాగా చెబుతున్నారు. అటు మమతా సైతం ఇదే తరహాలో ధీమాగా కనిపిస్తున్నారు.
గ్రామీణ బెంగాల్ మొత్తం తమ వైపే పూర్తిగా ఏకపక్షంగా నిలిచిందని టీఎంసీ నేతలు విశ్లేషిస్తున్నారు. పోలింగ్ సరళిని మమత, అభిషేక్ బెనర్జీ తదితర తృణమూల్ నేత లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేయగా.. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం లో కేంద్ర హోంమంత్రి అమిత్షా పార్టీ నేతలతో కలిసి ఎప్పటికప్పుడు సమీక్షించారు. అయితే.. తొలి విడతలో హోరా హోరీగానే పోరు సాగిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications