ఆమె ఇంటిని మినీ బ్యాంకులా వాడుకున్న మంత్రి?
పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణానికి సంబంధించి ఈడీ జరుపుతున్న విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్జితా ముఖర్జీతోపాటు మరికొంతమందిని ఈడీ అరెస్ట్ చేయడం సంచలనం కలిగించింది. ఈ సందర్భంగా విచారణలో అర్పితా ముఖర్జీ తన ఇంటిని మంత్రి ఒక మినీ బ్యాంకులా ఉపయోగించుకున్నారని, డబ్బును తన ఇంట్లోనే దాచేవారని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇంట్లోని ఒక గదిలో ఛటర్జీ డబ్బును దాచేవారని, ఆ గదిలోకి మంత్రికి, ఆయన మనుషులకు మాత్రమే ప్రవేశం ఉండేదని తెలిపింది. ప్రతి వారం పదిరోజులకు ఒకసారి ఛటర్జీ తన ఇంటికి వచ్చేవారని, తన ఇంటితోపాటు మరో మహిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంకులా వాడుకున్నారని చెప్పింది. ఆమె కూడా మంత్రికి సన్నిహితురాలేనని, ఆ గదిలో ఎంత డబ్బు ఉంచారో మంత్రి ఏనాడూ తనకు చెప్పలేదని తెలిపింది.
బెంగాలీ నటుడిద్వారా మంత్రితో తనకు పరిచయం ఏర్పడిందని, బదిలీలు, కళాశాలల గుర్తింపునకు సహకరించినందుకు ప్రతిఫలంగా ఈ డబ్బు అందేదని వెల్లడించారు. నేరారోపణలకు సంబంధించిన పత్రాలతోపాటు అర్పిత ఇంట్లో ఒక డైరీని ఈడీ స్వాధీనం చేసుకుంది. అందులో కీలక వివరాలుంటాయని భావిస్తున్నారు.
పార్థా ఛటర్జీ బెంగాల్ విద్యాశాఖ మంత్రిగా 2014-2021 మధ్య కాలంలో కొనసాగారు. ఆ సమయంలో జరిగిన నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఈడీ జరిపిన సోదాల్లో రూ.21 కోట్ల నగదు వెలుగు చూసింది. తన దగ్గర అంత డబ్బు ఎందుకుందనే విషయమై ఆమె సరైన వివరణ ఇవ్వలేకపోయింది. కుంభకోణంతో అర్పితకు ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాన్ని ఈడీ వ్యక్తం చేస్తోంది.