అమిత్ షా మౌనం వెనుక రహస్యం: అదే జరిగితే బీజేపీకి లాభం, కాంగ్రెస్ లో అప్పుడే రచ్చ !
Recommended Video
బెంగళూరు: అమిత్ షా మౌనం వెనుక ఓ రహస్యం ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులకే సీఎం పదవికి బీఎస్. యడ్యూరప్ప అసెంబ్లీలో రాజీనామా చేసిన వెంటనే ప్రతిపక్షాలు బీజేపీ మీద విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో బీజేపీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటకలో బీజేపీ కుట్రలు చెయ్యాలని చూస్తే కన్నడిగులు తరిమికొడతారని హెచ్చరించారు. బీజేపీ చాణుక్యుడు అమిత్ షా ట్రిక్కులు కర్ణాటకలో పని చెయ్యవని విమర్శించారు. ఇంకా కొందరు అయితే నోటీకి వచ్చిన తిట్లదండకంతో బీజేపీని విమర్శించారు. అయినా అమిత్ షా, బీజేపీ నాయకులు మౌనంగా ఉన్నారు.
చిన్న ఎదురు దెబ్బ
మే 19వ తేదీ శనివారం కర్ణాటక అసెంబ్లీలో బీఎస్. యడ్యూరప్పకు చిన్న ఎదురుదెబ్బ మాత్రమే తగిలిందని బీజేపీ నాయకులు అంటున్నారు. చిన్న ఎదురు దెబ్బతో తేరుకున్న బీఎస్. యడ్యూరప్ప ప్రతిపక్షాలకు తగినగుణపాఠం చెబుతారని బీజేపీ నాయకులు అంటున్నారు.
మంత్రి వర్గం రచ్చ
హెచ్ డి. కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత అసలు కథ మొదలౌతుందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఎందుకంటే 78 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 మంత్రి పదవులు మాత్రమే దక్కుతున్నాయి. హైకమాండ్ సూచించిన వారికి మాత్రమే మంత్రి పదవులు వస్తాయి.
డీసీఎం పదవికి వ్యతిరేకం
కాంగ్రెస్ పార్టీలోని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న కులస్తులు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదని ఇప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కులం వారికి హైకమాండ్ సర్దిచెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నది. దళితుడైన పరమేశ్వరకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ దాదాపు నిర్ణయించింది.
సిద్దరామయ్య రాజకీయం
ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవుల విషయంపై కాంగ్రెస్ లో ఇప్పటికే కొంత అసమ్మతి మొదలైయ్యింది. ఇక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన శైలి మార్కు రాజకీయాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ తరువాత తమకు అన్యాయం జరిగితే ఉత్తర కర్ణాటకు చెందిన అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టాలని ఇప్పటికే చర్చలు మొదలు పెట్టారని సమాచారం.
అమిత్ షా మౌనంగా ఉంటారా
పైన అనుకున్నవన్ని జరిగితే ఢిల్లీలో అమిత్ షా మౌనంగా కుర్చుంటారా అని బీజేపీ నాయకులు అంటున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఎలాగైనా ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నించిన ప్రధాని మోడీ, అమిత్ షా అప్పుడు చక్రం తిప్పుతారని బీజేపీ నాయకులు అంటున్నారు. బీఎస్. యడ్యూరప్ప శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.