సభలో గందరగోళంపై స్పీకర్ ఆవేదన: వెళ్లిపోయిన జగన్
సభలో గందరగోళంపై స్పీకర్ ఆవేదన: వెళ్లిపోయిన జగన్
న్యూఢిల్లీ: లోకసభలో గురువారం జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైనదని, సిగ్గుపడేలా ఉందని లోకసభ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. లోకసభలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఎంపీల పైన చర్యలు తీసుకునే విషయమై చర్చిస్తానని చెప్పారు. కాగా, పెప్పర్ స్ప్రేతో మీరా కుమార్ కూడా ఇబ్బంది పడ్డారు.
వెళ్లిపోయిన జగన్
లోకసభ ప్రారంభం కాగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్లకార్డుతో వెల్లోకి వచ్చారు. సీమాంధ్ర తెలుగుదేశం, కాంగ్రెసు ఎంపీల ఆందోళన మొదలైన వెంటనే జగన్ అక్కడి నుండి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ డబుల్ గేమ్: రాజ్నాథ్
తెలంగాణ అంశంలో కాంగ్రెసు పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ అన్నారు. ప్రధాని ఇచ్చిన విందు సమయంలో శాంతియుతంగా సభలు నడపాలని సూచించామన్నారు. తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని అదే సమయంలో సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలన్నారు. కాంగ్రెసు పార్టీ కారణంగానే సభలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఎంపీలపై చర్యలని షిండే
విభజన బిల్లు లోక్ సభలో ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర పరిస్థితులు సృష్టించేందుకు కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.