ఢిల్లీపై వీడని సస్పెన్స్: పార్టీలు నో చెబితే ఏమౌతుంది?
రెండో స్థానంలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎలాంటి ఉత్సాహం చూపడం లేదు. కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ శిబిరంలో మంగళవారం కొంత హడావుడి కనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తే మద్దతు ఇస్తామని తొలుత ప్రకటించినా.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది. అంతేకాదు బిజెపితో కలవాలని కేజ్రీవాల్కు సూచించింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఆమ్ ఆద్మీ పార్టీకి బేషరతుగా మద్దతివ్వాలని ఢిల్లీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయపడ్డారని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి షకీల్ అహ్మద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎఎపికి బయటి నుంచి మద్దతివ్వాలని తొలుత నిర్ణయించామన్నారు. అయితే ఎమ్మెల్యేల మనోభావాలను కూడా గుర్తించాల్సి ఉన్నందున వారితో సమావేశమైనట్లు ఆయన చెప్పారు. పార్టీ అధినాయకత్వం నిర్ణయం మేరకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అంగీకరించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్బబ్బర్ రంగ ప్రవేశం చేసి సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఢిల్లీ ఓటర్లు బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీలను ప్రతిపక్షంగానే పరిమితం కావాలంటూ విలక్షణ తీర్పు ఇచ్చారని గనుక ప్రభుత్వం ఏర్పాటులో తమ ప్రమేయం ఉండదన్నారు.
మరోవైపు బిజెపికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అర్వింద్ కేజ్రీవాల్ ఇది వరకే ప్రకటించారని, జన్లోక్పాల్ బిల్లుకు పార్లమెంటులో సహకరిస్తే బిజెపికి మద్దతు ఇస్తామని ఎఎపికి చెందిన మరో నాయకుడు ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారని రాజ్బబ్బర్ గుర్తు చేస్తున్నారు. అయితే అది ప్రశాంత్ భూషణ్ వ్యక్తిగత అభిప్రాయమని కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. బిజెపి, ఎఎపిలు మరోసారి ఎన్నికలకు సిద్దంగా ఉన్నాయి.
ఏ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేకపోతే రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందంటున్నారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపే అవకాశముంది. తప్పనిసరి అయితే మరో ఆరు నెలలు పొడిగించవచ్చు. అదే జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికలతో కలిసి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది.