'ఇండియా కోవిడ్ వేరియంట్' అంటే ఏమిటి... ఇది వ్యాక్సీన్కు లొంగుతుందా?
భారత్లో గుర్తించిన కరోనా కొత్త వేరియంట్ ఒకదానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. భారత్లో ప్రాణాంతకంగా పరిణమించిన సెకండ్ వేవ్ దీనివల్లే వచ్చిందా.. ఈ వేరియంట్ ప్రపంచంలో ఎక్కడెక్కడికి పాకిందనేది ఇంకా తెలియలేదు.
అసలు ఏమిటీ ఇండియా వేరియంట్?
వైరస్లు నిరంతరం ఉత్పరివర్తనం(మ్యుటేట్) చెందుతూ కొత్త రకాలను తయారుచేసుకుంటాయి.
ఇలాంటి మ్యుటేషన్లలో చాలావరకు గుర్తించలేం.. వీటిలో కొన్ని అసలు వైరస్ కంటే బలహీనంగా ఉంటే మరికొన్ని అసలు వైరస్ కంటే కూడా ప్రాణాంతకంగా మారుతాయి. కొన్ని మ్యుటేషన్లు వ్యాక్సీన్కు కూడా లొంగని పరిస్థితి ఉండొచ్చు.
ఇండియా వేరియంట్ వ్యాప్తి ఎలా ఉంది?
ఈ ఇండియా వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందింది.. ఎంత వేగంగా వ్యాపిస్తోందనేది తెలుసుకోవడానికి వీలుగా దేశవ్యాప్తంగా తగిన టెస్టింగ్ జరగలేదు.
జనవరి, మార్చి మధ్యలో మహారాష్ట్రలో సేకరించిన 361 కోవిడ్ శాంపిళ్లలో 220 శాంపిళ్లలో ఈ ఇండియా వేరియంట్ను గుర్తించారు.
ఇప్పటివరకు ఈ వేరియంట్ను 21 దేశాలలో గుర్తించారు.
బ్రిటన్లో ఫిబ్రవరి 22 తరువాత ఇలాంటివి 103 కేసులు గుర్తించారు.
ప్రస్తుతం భారత్ నుంచి యూకేకు ప్రయాణికులను అనుమతించడం లేదు.
ఇండియా వేరియంట్ మరింత ప్రమాదకరమా?
ఈ ఇండియన్ వేరియంట్ కరోనావైరస్కు సంక్రమించే గుణం మరింత ఎక్కువగా ఉందా.. వ్యాక్సీన్ను కూడా తట్టుకుని ఇది సంక్రమిస్తుందా అనేది శాస్త్రవేత్తలు ఇంకా తేల్చలేదు.
ఇండియన్ వేరియంట్లోని కొన్ని మ్యుటేషన్లకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లతో పోలిక ఉందని లూసియానా స్టేట్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ జెరెమీ కామిల్ అన్నారు.
రోగ నిరోధక శక్తిలోని యాంటీబాడీలను తప్పించుకుని మనిషి శరీరంలోకి ప్రవేశించేలా ఈ మ్యుటేషన్ వైరస్కు తోడ్పడగలదని కామిల్ అభిప్రాయపడ్డారు.
''బ్రిటన్లో గుర్తించిన వైరస్ వేరియంట్ ప్రమాదకరంగా ఉంది. ఇది బ్రిటన్లో ప్రబలంగా ఉండడమే కాకుండా 50 దేశాలకు వ్యాపించింది. ఇండియన్ వేరియంట్ బ్రిటన్ వేరియంట్ కంటే ప్రమాదకరమా కాదా అన్నది తెలియాలి'' అన్నారు కామిల్.
దీని గురించి పెద్దగా తెలియదు ఎందుకు?
ఇండియన్ వేరియంట్ కరోనావైరస్ గురించి పూర్తిగా తెలియకపోవడానికి కారణం తగినంత డాటా లేకపోవడమే. భారత్ నుంచి 298, మిగతా ప్రపంచం నుంచి 656 శాంపిళ్లు మాత్రమే దీనికి సంబంధించినవి ఉన్నాయి.
అదే యూకే వేరియంట్ విషయానికొస్తే 3,84,000 కంటే ఎక్కువ శాంపిళ్లు అందుబాటులో ఉన్నాయి.
సెకండ్ వేవ్ దీని వల్లేనా?
ఏప్రిల్ 15 తరువాత నుంచి రోజూ 2 లక్షల కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు భారత్లో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 22, 23 తేదీల్లో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.
గత ఏడాది కరోనావైరస్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా సగటున రోజుకు 93,000 కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం రోజువారీ మరణాల సంఖ్యా విపరీతంగా పెరుగుతోంది.
''భారత్లో జనాభా, అధిక జనసాంద్రత కూడా వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి, కొత్త మ్యుటేషన్లకు కారణం'' అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్లినికల్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ రవి గుప్తా అన్నారు.
ఇండియన్ వేరియంట్ వైరస్ గత ఏడాది నుంచే ఉందని.. తాజా వేవ్కు కనుక అదే కారణమి అనుకుంటే ఈ వేవ్ ఇప్పటికే వచ్చి ఉండాలని వెల్కమ్ సాంగర్ ఇనిస్టిట్యూట్కు చెందిన డాక్టర్ జెఫ్రీ బారెట్ అన్నారు. కెంట్ బీ117 వేరియంట్ కంటే దీనికి సంక్రమణ గుణం తక్కువేనని బారెట్ అన్నారు.
వ్యాక్సీన్ పనిచేయాలంటే...
వ్యాధి తీవ్రత తగ్గించే విషయంలో ఇండియన్ వేరియంట్పైనా ప్రస్తుత వ్యాక్సీన్లు పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రొఫెసర్ గుప్తా బృందం నేచర్ జర్నల్లో ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం కొన్ని వేరియంట్లు వ్యాక్సీన్లను కూడా తప్పించుకోగలవు.. అలాంటి పరిస్థితిని నివారించడానికి వ్యాక్సీన్ డిజైన్ కూడా మార్చి మరింత సమర్థంగా తయారుచేయాల్సి ఉంటుంది.
ప్రస్తుత వ్యాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తి వేగాన్ని అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా చనిపోయే పరిస్థితులు కంటే తక్కువ తీవ్రతతో వ్యాధి రావడమో, అసలు రాకపోవడమో జరగడం కొంత నయమని.. వ్యాక్సీన్ వల్ల అది సాధ్యమని చాలామంది అనుకుంటున్నారని డాక్టర్ కామిల్ చెప్పారు.
''కచ్చితమైన వ్యాక్సీన్ కోసం నిరీక్షించి సమయం వృథా చేసుకోవడం కంటే అందుబాటులో ఉన్న వ్యాక్సీన్ వేయించుకోవడం మంచిది'' అని డాక్టర్ కామిల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: సెకండ్ వేవ్లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- బెల్లం: ఆహారమా... ఔషధమా?
- తెలంగాణ: పదో తరగతి పరీక్షలు రద్దు.. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా
- దీర్ఘకాలిక కోవిడ్: 'రిపోర్టులన్నీ నార్మల్గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’
- స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్కు భారత్ అనుమతి.. ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు..
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- కరోనా వ్యాక్సీన్ : అన్ని ముస్లిం దేశాలు టీకా తీసుకుంటాయా ? హలాల్, హరామ్ చర్చ ఎందుకు మొదలైంది ? బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- కరోనావైరస్: మాస్క్ వేసుకోలేదని ఓ వ్యక్తిని రోడ్డు మీద పడేసి తీవ్రంగా కొట్టిన పోలీసులు... వైరల్ అయిన వీడియో
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్లో పరిస్థితి ఏంటి?
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్లో టీకాల కొరతకు కారణమేంటి..
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్లు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)