పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఇబ్బందులేంటి
ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయిగానీ, పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై మాత్రం నిర్ణయం తీసుకోలేదు.
ఈ సమావేశంలో మాట్లాడిన దిల్లీ ఆర్థిక మంత్రి, పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు ఇది సమయంకాదని, ఇది రాష్ట్రాల ఆదాయంపై ప్రభుత్వం చూపుతుందని అన్నారు.
మరోవైపు, మహారాష్ట్ర, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించాయి. రెండు రాష్ట్రాల నుంచి ఈ ప్రకటన వెలువడిన రోజే జీఎస్టీ సమావేశం జరిగింది.
''కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మీకు ఎలాంటి సమాచారం రాలేదు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 30-32 వేల కోట్ల జీఎస్టీ కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం తాను విధించే పన్నును తగ్గించుకోవచ్చు'' అని మహారాష్ట్ర ఆర్ధిక మంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర తర్వాత కేరళ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించింది. ''పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే నిర్ణయం తీసుకుంటే మేం దాన్ని వ్యతిరేకిస్తాం'' అని కేరళ ఆర్థిక మంత్రి ఎన్. బాలగోపాల్ పీటీఐతో అన్నారు.
దేశంలో జీఎస్టీ వ్యవస్థ జూలై 1, 2017 నుండి అమలులోకి వచ్చింది. ఆ సమయంలో అయిదు రకాల పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించారు. వీటిని కూడా చేరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల మీద ప్రభావం పడుతుందని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది.
- యూపీఏ విధానాల కారణంగానే చమురు ధరలు పెరుగుతున్నాయా
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ వనరు
ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీయేతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జూలైలో దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ''2014-15 నుండి పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను సేకరణ ద్వారా సేకరించిన మొత్తంలో 370 శాతం పెరుగుదల ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే కేంద్రం 3.71 లక్షల కోట్లు సంపాదించింది'' అన్నారు మమతా బెనర్జీ
కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని అంగీకరిస్తోంది. ఇంత ఆదాయ సంపాదించారు కాబట్టి పన్నులను తగ్గించాలని రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
తాజాగా పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఇదే జరిగితే, సాధారణ ప్రజానీకం ఎంతో ప్రయోజనం పొందుతారు. దానివల్ల వాటి ధరలు 25 నుంచి 30 శాతం వరకు తగ్గవచ్చు.
వాస్తవానికి పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ ఏడాది జూన్లో కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోర్టు వ్యాఖ్యానించింది.
కేంద్రానికెంత, రాష్ట్రానికెంత?
పెట్రో ధరలపై పన్నులను కేంద్ర రాష్ట్రాలు ఎలా పంచుకుంటాయో తెలుసుకోవడం ముఖ్యం. సెప్టెంబర్ 16న దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉంది.
పెట్రోల్ ధరల పెరుగుదలను పరిశీలిస్తే:
- డీలర్కు లభించే ధర లీటర్రు రూ .41.10
- లీటరు మీద ఎక్సైజ్ సుంకం రూ .32.90
- వ్యాట్ రూ .23.35
- డీలర్ కమీషన్ లీటరు రూ. 3.84
- అంతా కలిపితే లీటరు ధర రూ.101.19
ఇందులో రూ.32.90 ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది. వ్యాట్ రూ.23.35 దిల్లీ ప్రభుత్వానికి చేరుతుంది. అంటే, దిల్లీలో పెట్రోల్ బేస్ ధర కంటే రెండింతలకు పైగా పలుకుతోంది. ఆ మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళతాయి.
జీఎస్టీ పరిధిలోకి రావడం వల్ల వచ్చే నష్టం ఏమిటి?
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు సుశీల్ మోదీ కూడా పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనను వ్యతిరేకిస్తున్నారు.
''పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 4.10 లక్షల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. దీన్ని తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టం'' అన్నారాయన.
పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి సౌరభ్ చంద్ర దీనిపై మాట్లాడారు.
''దేశంలో ఏటా 10-11 వేల కోట్ల లీటర్ల డీజిల్ అమ్ముడవుతోంది. 3-4 వేల కోట్ల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. రెండు ఉత్పత్తులను కలిపి దాదాపు 14 వేల కోట్ల లీటర్ల వరకు అమ్ముడవుతోంది. రాష్ట్రాలు దానిపై ఒక్క రూపాయి మాత్రమే వ్యాట్ విధించాయని అనుకుందాం. అప్పుడు దాని వల్ల వచ్చే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు'' అన్నారాయన.
ఈ నష్టం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఆయా రాష్ట్రాలలో జరిగే అమ్మకాలు, విధించే పన్నులశాతం ఈ నష్టాన్ని నిర్ణయిస్తాయి. కేరళనే తీసుకుంటే ఏటా ఈ నష్టం రూ.8000 కోట్లు ఉంటుందని అంచనా.
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- పెట్రోలు, డీజిల్: ధరలు ఎప్పుడు తగ్గుతాయి.. తగ్గాలంటే మోదీ ప్రభుత్వం ఏం చేయాలి
ఎలా భర్తీ చేయాలి?
''పెట్రోల్-డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం చాలా కష్టం'' అన్నారు సౌరభ్ చంద్ర. ''రాష్ట్ర ప్రభుత్వం తన పన్నును వదులుకోవడానికి ఇష్టపడదు. కేంద్రమూ అంతే. రెండింటికీ ఆదాయం తెచ్చిపెట్టేది ఇదే'' అన్నారాయన.
ప్రస్తుతం పెట్రోలు, డీజిల్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వందశాతం పన్నును వసూలు చేస్తున్నాయని, అలాంటి పరిస్థితుల్లో 28% శాతమే పన్ను విధిస్తే మిగిలిన నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
దీనికి కొన్ని ప్రత్యామ్నాయలు ఉన్నాయని కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. ''ఈ పన్ను ఆదాయంలో నష్టాన్ని తగ్గించడానికి 28% జీఎస్టీతోపాటు, కేంద్ర ప్రభుత్వం లగ్జరీ కార్లపై విధించినట్లుగా అదనపు ఛార్జి విధించాలి'' అన్నారు గార్గ్.
''జీఎస్టీ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. దాని నుండి వచ్చే ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పంచుకోవాలి. దీనికోసం ఓ ఫార్ములా రూపొందించుకోవాలి'' అన్నారాయన.
జీఎస్టీ చట్టానికి సంబంధించి ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదం ఉంది. జీఎస్టీ అమలు తర్వాత అయిదేళ్లపాటు ఆదాయంలో నష్టాన్ని భర్తీ చేయడానికి రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలనే నిబంధన చట్టంలో ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయంలో సుమారు రూ. 2.35 లక్షల కోట్ల నష్టాన్ని భర్తీ చేయడం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం వాదులాడుకుంటున్నాయి.
ఈ పరిస్థితుల్లో మరొక నష్టం కూడా తోడయితే అప్పుడు సమస్య ఇంకా పెరుగుతుంది.
వాస్తవానికి, రాష్ట్రాలకు ఆదాయ మార్గాలు పరిమితం. మద్యం, పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులే అతిపెద్ద వనరులు. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఏ నిర్ణయం తీసుకున్నా అది కేంద్రం మీదా, రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుంది.
అదే సమయంలో సామాన్యుల జేబులను రక్షించాల్సిన అవసరం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- విశాఖ ఎర్రమట్టి దిబ్బలు: వేల సంవత్సరాల క్రితం ఎలా ఏర్పడ్డాయి, ఇప్పుడెందుకు తరిగిపోతున్నాయి
- హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా..
- ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లు 40 శాతానికి పెంపు, మగవాళ్ల అవకాశాలపై ఇదెంత ప్రభావం చూపిస్తుంది?
- బెల్లం: ఆహారమా... ఔషధమా
- AUKUS ఒప్పందం ఏంటి? అమెరికా, ఆస్ట్రేలియాపై ఫ్రాన్స్ ఆగ్రహం ఎందుకు? చైనా ఎందుకు భయపడుతోంది?
- ఒక్క భోజనం 40 వేల రూపాయలు.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు... ఏంటి దీని ప్రత్యేకత
- తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'
- 'ఇడ్లీ అమ్మ’కు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్.. చనిపోయే దాకా ఒక్క రూపాయికే ఇడ్లీ అమ్ముతానంటున్న కమలాత్తాళ్
- బ్రిటన్లో భారతీయ వంటకాల వ్యాపారం చేస్తున్న 76 ఏళ్ళ బామ్మ
- 'ఈ నత్తలను తింటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది... చలికాలం పున్నమి రోజుల్లో మాత్రమే వీటిని వేటాడాలి'
- ఆహారం వృథా: ఏటా 90 కోట్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారు...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)