వంద, వెయ్యి తెలుసు.. 'జీరో నోటు' గురించి తెలుసా?
న్యూఢిల్లీ : వంద నోటు, వెయ్యి నోటు గురించి వినుంటారు గానీ జీరో నోటు గురించి ఎప్పుడైనా విన్నారా! బహుశా అతికొద్ది మంది మాత్రమే దీని గురించి వినుంటారు. ఫిఫ్త్ పిల్లర్ పేరిట ఏర్పాటైన ఓ స్వచ్చంద సంస్థ జీరో నోట్లను 2007లో ప్రవేశపెట్టింది. వీటి ఉద్దేశ్యం.. కేవలం లంచావతారుల ఆట కట్టించడానికి మాత్రమే.
అంటే.. ఎవరైనా లంచం అడిగినప్పుడు ఈ జీరో నోటును తీసి సదరు లంచాధికారి చేతిలో పెట్టాలన్నమాట. నోటుపై 'నేను లంచం ఇవ్వను, తీసుకోబోనని ప్రమాణం చేస్తున్నా' అన్న హెచ్చరిక రాసి ఉంటుంది. తద్వారా లంచం అడిగినవాళ్లకు.. తమ డిమాండ్ చట్ట విరుద్దమన్న భావన కలిగే అవకాశం ఉంటుందనేది ఫిఫ్త్ పిల్లర్ సంస్థ ఆలోచన.
జీరో నోటు ద్వారా చాలామంది లంచాధికారుల్లో మార్పు తీసుకొచ్చినట్టు.. గతంలో తమ వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది ఫిఫ్త్ పిల్లర్. భారత్ లో జీరో నోటు ద్వారా సాధించిన విజయం.. నేపాల్, ఘనా, బెనిన్, మెక్సికో, యెమెన్వంటి దేశాలపైనా ప్రభావం చూపించినట్టుగా సంస్థ పేర్కొంది. జీరో నోటు ద్వారా అవినీతి సమూలంగా పెకిలించివేయడం సాధ్యం కాకపోయినప్పటికీ.. కొంతలో కొంత నిర్మూలించగలిగిన అది సమాజానికి శ్రేయస్కరమే అన్నది చాలామంది వాదన.
ఇక ఈ జీరో నోటు ఎలా ఉంటుందంటే.. పూర్తిగా రూ.50ను పోలి ఉంటుంది. అదే రంగులో.. కుడివైపున గాంధీ బొమ్మతో అచ్చు రూ.50 లాగే ఉంటుంది.