చదువుకోకపోయినా ఎమ్మెల్యేలుగా.. అమ్మ చివరి మాట ఏంటంటే!: శశికళ
'మన పార్టీని ఎవరూ నాశనం చేయలేరు' అని చివరిమాటగా అమ్మ తనతో చెప్పారని శశికళ పేర్కొన్నారు.
చెన్నై: అమ్మ మరణానంతర పరిణామాలు తమిళ రాజకీయాలను సంక్షోభం దిశగా నడిపిస్తున్నాయి. పార్టీని అంతా తానై నడిపించిన జయలలిత కన్నుమూయడంతో ఏకంగా అన్నాడీఎంకె చీలిపోయే పరిస్థితి వచ్చింది. చనిపోయే నాటికి ఆమె మనసులో ఏముందో తెలియదు గానీ తాజాగా ఆ విషయాల గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ మీడియాతో వెల్లడించారు.
అమ్మ చివరి రోజుల్లో ఆమెతో గడిపిన ఏకైక వ్యక్తిగా శశికళ కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. 'మన పార్టీని ఎవరూ నాశనం చేయలేరు' అని చివరిమాటగా అమ్మ తనతో చెప్పారని శశికళ పేర్కొన్నారు. అందువల్లే పార్టీని కాపాడేందుకు తాను ప్రాణ త్యాగానికైనా సిద్దమని అని స్పష్టం చేశారు.
అన్నాడీఎంకె ఎమ్మెల్యేల్లో ఎవరూ పెద్దగా చదువుకోకపోయినా జయలలిత వారిని ఎమ్మెల్యేలుగా తయారుచేశారని అన్నారు. జయలలిత వారికి ఇచ్చిన శిక్షణ, ఆమె చేసిన సేవలు మరిచిపోవద్దని పేర్కొన్నారు. కన్నీళ్లను ఆపుకుంటూ అమ్మ గుర్తొస్తే ఇప్పటికీ ఏడుపు వస్తుందని శశికళ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మతో పాటు ఎమ్మెల్యేలు తన మీద ఉంచిన బాధ్యతను నెరవేర్చి తీరుతానని శశికళ అన్నారు.
అన్నాడీఎంకెకు కష్టకాలం ఎదురైందని, అయినంత మాత్రాన తనను ఎవరూ ఏమి చేయలేరని శశికళ తేల్చి చెప్పారు. తాను సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. మహిళను కాబట్టి తొక్కేయాలన్న ఉద్దేశంతో ప్రతిపక్షాలు తనను తక్కువ అంచనా వేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అమ్మను వారు ఏమి చేయలేకపోయారని, తనను కూడా ఏమి చేయలేరని శశికళ చెప్పుకొచ్చారు.