నిన్న పొగడ్త: మోడీకి శశిథరూర్ చికెన్ బిర్యానీ కౌంటర్
న్యూఢిల్లీ: కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తాజాగా గతంలో మోడీ మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చారు. తన ప్రమాణ స్వీకారానికి మోడీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే, సార్క్ దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానంపై శశిథరూర్ స్పందించారు. మోడీ ఆహ్వానాన్ని నవాజ్ షరీఫ్ స్వాగతించి.. వస్తే.. మోడీ ఆయనకు చికెన్ బిర్యానీ సర్వ్ చేస్తారేమోనని వ్యాఖ్యానించారు.
గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే శశిథరూర్ ఈ వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ మన సైనికుల తలలు నరుకుతుంటే, భారత్ వచ్చిన పాకిస్తాన్ అధినేత రాజా పర్వేజ్ అష్రాఫ్కు కేంద్ర ప్రభుత్వం చికెన్ బిర్యానీ వడ్డించిందని ఎద్దేవా చేశారు.
కాగా, రెండు రోజుల క్రితం మోడీ పైన శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోడీ ప్రసంగం తనను ఆకట్టుకుందని శశిథరూర్ చెప్పారు. మోడీ తన సందేశంలో శాంతిని, కలుపుకుపోయే విషయాన్ని చెప్పారని ట్వీట్ చేశారు.