రాహుల్ ఎక్కడ?: కర్ణాటక ఫలితాలపై ఆయన స్పందనేది?..
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీకి అధికార పీఠం దక్కకుండా చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్ కు బేషరతు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని కాదని గవర్నర్ కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చేది అనుమానమే. అదే సమయంలో జేడీఎస్ ను చీల్చేందుకు బీజేపీ కూడా తెర వెనుక ప్రయత్నాలు ప్రారంభించింది. కర్ణాటకలో ఇంత జరుగుతుంటే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి ఎక్కడా, ఎటువంటి స్పందన లేకపోవడం గమనార్హం.
కర్ణాటక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసిన రాహుల్.. కౌంటింగ్ రోజు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాయకత్వ లోపాలపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్.. తన ఖాతాలో మరో ఓటమి నమోదు కావడంతో అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక ఫలితాలపై రాహుల్ ను సంప్రదించేందుకు పలు మీడియా సంస్థలు ప్రయత్నించగా.. ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదు.
అయితే ఎన్నికల్లో ఫలితాలపై ఢీలా పడకుండా.. ప్రస్తుత పరిస్థితులను నేర్పుగా చక్కదిద్దే ప్రయత్నం చేయగలిగితే రాహుల్ తన రాజకీయాలకు పదును పెట్టుకోవచ్చని పరిశీలకలు అభిప్రాయపడుతున్నారు.