తప్పును సరిచేసుకున్నాం: భారత్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు: ప్రపంచఆరోగ్య సంస్థ
న్యూఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 200కు పైగా దేశాలు ఈ మహమ్మారి బారినపడ్డాయి. వేల సంఖ్యలో మరణించగా లక్షల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఇక అన్ని దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో వదంతులు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. ఏది నిజమో ఏది అవాస్తవమో తెలియక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ప్రపంచదేశాలకు సూచనలు చేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పొరపాటు చేయడంతో ఒక్కింత ఆందోళనకు గురయ్యారు.
భారత దేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ కరోనావైరస్ వ్యాప్తి చెందిందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికలో ఉంది. అయితే దీంతో ప్రభుత్వం ఆందోళన చెందింది. అయితే అది పొరపాటు జరిగిందని భారత్లో కరోనావైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ద్వారా జరిగింది కాదని స్పష్టం చేసింది. ఆ తప్పిదాన్ని సరిజేసుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ప్రకటనలో ఏదో పొరపాటు జరిగిందని భారత్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఇంకా రాలేదని భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం విడుదల చేసిన తాజా ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తప్పును సరిజేసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు భారత్లో కరోనావైరస్ ప్రభావం మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని వెల్లడించింది.
ఇదిలా ఉంటే గురువారం రోజున 16002 శాంపిల్స్ టెస్టింగ్కు పంపగా అందులో 320 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు. అంటే 2శాతం కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. శాంపిల్స్ సేకరణ వచ్చిన ఫలితాల నివేదికను బట్టి భారత్లో వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో లేదని ఇందుకు కారణం లాక్డౌనే అని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఇక 7447 కరోనావైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. ఇప్పటి వరకు 239 మంది మృతి చెందినట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. ఇక చికిత్స తీసుకుని 642 మంది కోలుకున్నారని వారంతా ఢిశ్చార్జ్ అయ్యారని చెప్పారు లవ్ అగర్వాల్.