బిగ్ షాకింగ్ : ఇద్దరు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులకు కరోనా పాజిటివ్..
కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. కేసుల సంఖ్యతో పోల్చితే మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా దారితీయవచ్చుననే ఆందోళన నెలకొంది. దాదాపుగా అన్ని దేశాలు కరోనాపై యుద్దం ప్రకటించేశాయి. డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) మార్గదర్శకాల ప్రకారం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్ నియంత్రణపై ప్రపంచానికి మార్గదర్శకంగా వ్యవహరిస్తున్న డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులకు సైతం కరోనా సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తమ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు డబ్ల్యూహెచ్ఓ మంగళవారం వెల్లడించింది. ఒక కేసు జెనీవాలోని డబ్ల్యూహెచ్ఓ కార్యాలయంలో నమోదు కాగా.. మరో కేసు జెనీవాలోని ఐరాస కార్యాలయంలో నమోదైనట్టు తెలిపింది. ఆఫీస్ నుంచి ఇంటికెళ్లాక వారిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయని.. వైద్య పరీక్షల్లో పాజిటివ్గా తేలిందని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మీర్ తెలిపారు. అయితే కరోనా వైరస్ సోకిన ఆ ఇద్దరు డబ్ల్యూహెచ్ఓ తరుపున కరోనా వైరస్ నియంత్రణ కోసం పనిచేస్తున్నారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 179823 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 7130 మంది మృత్యువాతపడ్డారు. ఇక భారత్లోనూ చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 137కి చేరింది. ఇందులో మహారాష్ట్రలో అత్యధికంగా 40 కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కేంద్రంగా మహారాష్ట్ర ఉంది. ఇప్పటికే ముంబైలో మాల్స్,థియేటర్స్ మూసివేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు,కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించారు. ఇప్పటికైతే మహారాష్ట్రలో రైళ్లు,బస్సులు యథావిధిగానే నడుస్తున్నాయి. అయితే ప్రజలు ప్రభుత్వ సలహాలు,సూచనలు పాటించకుండా.. అనవసర ప్రయాణాలు చేస్తే మాత్రం.. రవాణా సౌకర్యాన్ని కూడా నిలిపివేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే హెచ్చరించారు.