డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు: న్యూయార్క్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఆ కథనం
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అగ్ర నాయకుల నివాసాలపై దాడులకు దిగింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంలో సోదాలను నిర్వహిస్తోన్నారు సీబీఐ అధికారులు. ఆయనతో పాటు ఒకరిద్దరు ఇతర మంత్రుల ఇళ్ల మీద కూడా సీబీఐ అధికారులు ఏక కాలంలో దాడులు సాగిస్తోన్నారు. ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపీకృష్ణ నివాసంలోనూ తనిఖీలు చేస్తోన్నారు.
21 ప్రాంతాల్లో ఏకకాలంలో..
మొత్తంగా ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు మెరుపుదాడులకు దిగారు. ఈ ఘటన అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు అధికార యంత్రాంగంలో కలకలం రేపింది. ఏక కాలంలో చేపట్టిన ఈ దాడులకు ప్రధాన కారణం.. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవలే ఆమోదించిన నూతన ఎక్సైజ్ పాలసీనే కారణం అనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ పాలసీని ఆమోదించడం భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఫిర్యాదులు అందడం వల్ల దాడులు చేపటినట్లు సమాచారం.
వరుస ట్వీట్లు..
సీబీఐ అధికారులు తన నివాసానికి చేరుకున్నారనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన దీనిపై వరుస ట్వీట్లను పోస్ట్ చేశారు. విద్యా వ్యవస్థను అత్యున్నతంగా తీర్చిదిద్దినందుకే ఈ దాడులను చవి చూడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. సమాజానికి, ప్రజలకు మంచి చేయాలనుకునే వారిపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారుల దాడులు సర్వ సాధారణమని వ్యాఖ్యానించారు.
మంచి చేయాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవ్..
ఈ దాడుల పట్ల తాను భయపడట్లేదని, సీబీఐ అధికారులను స్వాగతిస్తున్నానని మనీష్ సిసోడియా చెప్పారు. దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నానని అన్నారు. ఇదివరకే తనను ఇరికించడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగాయని, అవేవీ తనను అవినీతిపరుడిగా నిర్ధారించలేకపోయాయని చెప్పారు. అప్పుడెలా తాను నిజాయితీగా బయటపడ్డానో.. ఇప్పుడు అదే విధంగా బయటికి వస్తానని అన్నారు. మంచి చేయాలనుకునే వారికి ఇబ్బందులకు గురి చేస్తే దేశం ఎలా అగ్రస్థానానికి చేరుకుంటుందని ప్రశ్నించారు.
విద్య, వైద్యం..
ఢిల్లీలో తమ ప్రభుత్వం చేపట్టిన విద్య, వైద్యరంగాల అభివృద్ధి కొందరికి కంటగింపుగా మారిందని వ్యాఖ్యానించారు. అందుకే ఆరోగ్య, విద్యా మంత్రిని తమ రాడార్లోకి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. తమ ఇద్దరి మీద ఎలాంటి ఆరోపణలు లేవని, సీబీఐ అధికారులకు అందిన ఫిర్యాదులు.. కేవలం ఆరోపణలేనని చెప్పారు. న్యాయస్థానాల్లో తమ నిజాయితీని నిరూపించుకుంటామని పేర్కొన్నారు. ఢిల్లీలో విద్యా ప్రమాణాలను పెంచడం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని మనీష్ సిసోడియా చెప్పారు.
న్యూయార్క్ టైమ్స్లో ఆ కథనం..
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న విద్య విధానాన్ని ప్రశంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ఫ్రంట్ పేజీలో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అవర్ చిల్రడ్న్ ఆర్ వర్త్ ఇట్ శీర్షికను ఇది ప్రచురితమైంది. మనీష్ సిసోడియా ఓ విద్యార్థినితో మాట్లాడుతోన్న ఫొటోను ప్రముఖంగా ప్రింట్ చేసింది. దీన్ని అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన అరగంటకే సీబీఐ దాడులు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications