పోలీసులు ఇంత నీచంగానా?: గ్యాంగ్రేప్ బాధితురాలి ఆవేదన
తిరువనంతపురం: తనకు న్యాయం చేయండంటూ పోలీసులను ఆశ్రయిస్తే వాళ్లు కూడా కీచకుల్లా మారిపోయారని ఓ అత్యాచార బాధితురాలు వాపోయింది. నిందితుల నుంచి కాపాడమని వెళితే.. నిందితుల కంటే కూడా పోలీసుల వేధింపులే ఎక్కువైపోయాయని బాధితురాలు కన్నీరుమున్నీరైంది. ఈ దారుణ ఘటన కేరళలో చోటు చేసుకుంది. బాధితురాలు తన భర్తతో కలిసి పోలీసుల నీచపు వ్యవహారాన్ని మీడియాకు వివరించింది.
'నేను మళ్లీ పోలీసు కేసు పెట్టాలనుకోవడం లేదు. నాపై జరిగిన అత్యాచారం కంటే పోలీసుల వేధింపులే దారుణంగా ఉన్నాయి. పోలీసుల బెదిరింపులు, వేధింపులు తట్టులేకోపోతున్నాం' అని కేరళలో సామూహిక అత్యారానికి గురైన 35 ఏళ్ల మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మూడు నెలల నుంచి తనను నీచపు ప్రశ్నలతో తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని, తనపై ఒత్తిడి పెంచి కేసు ఉపసంహరించుకునేలా చేశారని వాపోయింది.
కాగా, బాధితురాలి కన్నీటి గాథను ప్రముఖ డబ్బింగ్ కళాకారిణి భాగ్యల్మక్షి ఫేస్బుక్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో త్రిశూర్లో బాధితురాలిపై ఆమె భర్త స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఆస్పత్రిలో ఉన్నాడని నమ్మబలికి ఇంట్లోంచి ఆమెను బయటకు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు.
నలుగురు నిందితు(జయంతన్, బినీశ్, జనీశ్, శిబు )ల్లో ఒకరు రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నట్టు భాగ్యలక్ష్మి వెల్లడించారు. భర్తతో కలిసి బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, 'నిందితుల్లో ఎవరు ఎక్కువ ఆనందాన్నిచ్చారు' అంటూ బాధితురాలిని నీచంగా ప్రశ్నిచారు ఆ దుర్మార్గపు పోలీసులు. దీంతో సదరు పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాధితురాలు కేసు వెనక్కి తీసుకుందని వివరించారు.
అంతేగాక, నిజం చెబితే తన పిల్లలను చంపుతామని నిందితులు బెదిరింపులకు గురిచేశారని, ఈ నేపథ్యంలో న్యాయమూర్తి తనను 'నీపై ఒత్తిడి ఏమైనా ఉందా?' అడిగినప్పుడు ఏడ్చేసినట్లు బాధితురాలు తెలిపారు. ఇటు నిందితులు, అటు పోలీసుల బెదిరింపులు, వేధింపులతో కేసును ఉపసంహరించుకున్నట్లు బాధితురాలు కంటతడి పెట్టింది.
ఫేస్బుక్లో పెట్టిన భాగ్యలక్ష్మి పోస్టు విపరీతంగా షేర్ కావడంతో విషయం ముఖ్యమంత్రి పినరయి విజయన్ దృష్టికి వెళ్లింది. దీంతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఎం కార్యాలయం హామీ ఇచ్చింది.