పెరిగిన మోడీ ప్రతిష్ట: ఊపందుకున్న ప్రచారం, సీఎం అభ్యర్ధి ఎవరో?
లక్నో: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇందులో భాగంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే తమ సీఎం అభ్యర్ధిని ప్రకటించిన సంగతి తెలిసిందే. సమాజ్వాది పార్టీ తరఫున ప్రస్తుత సీఎం అఖిలేష్ యాదవే మళ్లీ అభ్యర్థికాగా, బహుజన సమాజ్ వాది పార్టీ తరఫున మాయావతి, కాంగ్రెస్ పార్టీ తరఫున ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పోటీ చేస్తున్నారు.
అయితే బీజేపీ తరుపున సీఎం అభ్యర్తిత్వంపై ఇంకా ప్రకటన విడుదల కాలేదు. బీజేపీ తరుపున సీఎం అభ్యర్ధిపై పార్టీ సీనియర్లు మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో పీఓకేలోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ట దేశ ప్రజల్లో అమాంతం పెరిగింది.
దీంతో రాబోయే యూపీ ఎన్నికల్లో ప్రధాని మోడీ ఇమేజితో పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తుండగా, ఈ నెల 11వ తేదీన లక్నోలో నిర్వహించే ప్రధాని బహిరంగ సభకు హాజరయ్యే జనం స్పందనను చూసి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు నేతలు భావిస్తున్నారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అదే రోజు అశిష్బాగ్లో నిర్వహించే రామ్లీలా ఉత్సవాల్లో భాగంగా రావణాసురిడి బొమ్మను ప్రధాని మోడీ తగలబెట్టనున్నారు. పాక్పై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించిన అనంతరం రావణుడిపైకి బాణం వదులుతున్న రాముడిగా ప్రధానిని చూపిస్తూ, రాష్ట్రమంతటా పోస్టులు వెలిశాయి.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించడం వల్ల పార్టీ విజయం సాధించిందని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఇమేజ్పైనే పోటీ చేయడం వల్ల పార్టీ ఓడిపోయిందని కొందరు బీజీపీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో యూపీలో బీజేపీ సీఎం అభ్యర్ధి ఎవరనేది దసరా తర్వాతనే వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.