ఉద్దవ్ సేనలో జయంత్ పాటిల్.. మంత్రిగా దిమ్మతిరిగే రికార్డు.. పలు సంస్కరణలతో
మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. శివాజీ పార్క్ వద్ద సీఎంగా ఉద్దవ్ థాకరేతో ప్రమాణ స్వీకార ఘట్ట ఆరంభమైంది. తర్వాత జయంత్ పాటిల్ మంత్రిగా ప్రమాణం చేశారు. జయంత్ పాటిల్ ఎన్సీపీ పార్టీకి చెందిన వారు. మహారాష్ట్ర ఎన్సీపీ శాఖ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.
తండ్రి మరణంతో..
1962లో జయంత్ పాటిల్ జన్మించారు. జయంత్ తండ్రి రాజరాంబాపు పాటిల్ కూడా రాజకీయ నేతనే.. అయితే ఆయన 1984లో చనిపోవడంతో జయంత్ పాటిల్ రాజకీయల్లోకి వచ్చారు. అమెరికాలో పై చదువులను మధ్యలోనే ఆపివేసి ఇండియా తిరిగొచ్చారు. ఇస్లాంపూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. విజయ పరంపర కొనసాగించారు. 27 ఏళ్ల నుంచి తన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గతంలో కూడా..
ఇప్పుడే కాదు 1999 నుంచి 2008 వరకు కూడా జయంత్ పాటిల్ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి జయంత్ పాటిల్ రికార్డు సృష్టించారు. ఆ సమయంలోనే ఆర్థిక మాంద్యం కూడా ఉన్న సంగతి తెలిసిందే. 2008లో ముంబైలో ఉగ్రదాడుల తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ఆర్ ఆర్ పాటిల్ హోంశాఖ మంత్రి పదవీకి రాజీనామా చేశారు. దీంతో జయంత్ పాటిల్కు హోంమంత్రి పదవీ చేపట్టే అవకాశం లభించింది. తన హయాంలో పోలీసుశాఖలో వినూత్న విధానాలను అవలంభించారు. పోలీసులకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను అందజేశారు.
ఫస్ట్ ర్యాంక్
2009 నుంచి 2014 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా జయంత్ పాటిల్ పనిచేశారు. ఆ సమయంలో మహారాష్ట్రలో దేశంలో తొలి స్థానం నిలవడం విశేషం. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వద్ద ప్రధాని మన్మోహన్ సింగ్ చేతులమీదుగా పాటిల్ పురస్కారం అందుకున్నారు.
పవార్ బంటు
జయంత్ పాటిల్ ఎన్సీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పాటిల్తోపాటు చగన్ భుజ్బల్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఒకరికి డిప్యూటీ సీఎం పదవీ దక్కే అవకాశం ఉంది. అజిత్ పవార్ను బుజ్జగించేందుకు కూడా రంగంలోకి దిగారు. శరద్ పవార్ సూచనల మేరకు పార్టీలో తనకంటూ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శరద్ పవార్కు నమ్మినబంటు కూడా..
వేడుకగా
శివాజీ పార్క్ వద్ద జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి అధినేతలు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆశీనులయ్యారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సుప్రియ సూలే, అజిత్ పవార్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు హాజరయ్యారు.