రఘును చంపిందెవరు?: తమిళనాడులో ఇప్పుడిదో సంచలన ప్రశ్న..
కోయంబత్తూర్కు చెందిన రఘుపతి కందసామి(30) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లిచూపుల నిమిత్తం గతవారమే అమెరికా నుంచి కోయంబత్తూర్ వచ్చాడు.
కోయంబత్తూర్: రాజకీయ పార్టీల బాధ్యతారాహిత్యానికి సామాన్యులు బలి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. చెన్నైలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టెక్కీ రఘు మృతికి పరోక్షంగా అక్కడి అధికార పార్టీయే కారణమని చాలామంది విమర్శిస్తున్నారు.
పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి ఇండియా వచ్చినవాడు కాస్త.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. నిబంధనలను ఖాతరు చేయకుండా అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఓ హోర్డింగ్ వల్లే రఘు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
రఘు కందసామి:
కోయంబత్తూర్కు చెందిన రఘుపతి కందసామి(30) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లిచూపుల నిమిత్తం గతవారమే అమెరికా నుంచి కోయంబత్తూర్ వచ్చాడు. శుక్రవారం ఏదో పని నిమిత్తం బైక్పై వెళ్తుండగా రోడ్డు పక్కనే ఏర్పాటుచేసిన అన్నాడీఎంకే పార్టీ హోర్డింగ్ను ఢీకొన్నాడు. కింద పడటంతో అటుగా వెళ్తున్న ఓ ట్రక్కు అతని పైనుంచి దూసుకెళ్లింది. ఆ సమయంలో రఘు హెల్మెట్ ధరించకపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
'రఘును చంపిందెవరు?':
గత అక్టోబర్ 3న ఎంజీఆర్ జయంతి వేడుకల సందర్భంగా అధికార అన్నాడీఎంకె పార్టీ ఆ హోర్డింగ్ ఏర్పాటు చేయించింది. వేడుకలు ముగిసిన తర్వాత కూడా ఆ హోర్డింగును అలాగే వదిలేశారు.
రోడ్డు ప్రమాదంలో రఘు దుర్మరణం తర్వాత చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు కొంతమంది ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రఘు మృతి చెందిన స్పాట్లో 'రఘును చంపిందెవరు?' అని రోడ్డుపై పెద్దపెద్ద అక్షరాలతో పెయింటింగ్ వేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ గా మారింది.
స్టాలిన్ ఆగ్రహం:
డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ఎంజీఆర్ సెంటినరీ అనే హాష్ ట్యాగ్ తో ఆయన ట్విట్టర్ లో స్పందించారు. వాహనదారులకు అవరోధంగా ఉండే ప్రమాదకరమైన హోర్డింగ్స్ పెట్టరాదన్న హైకోర్టు ఆదేశాలను అధికార పార్టీ ఉల్లంఘించిందని ఆరోపించారు. ఆ కారణంగానే రఘు దుర్మరణం పాలయ్యాడని అన్నారు. ప్రభుత్వ చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
హైకోర్టులో పిటిషన్:
కోయంబత్తూర్ లోని అన్ని హోర్డింగ్స్ ను తొలగించాలంటూ స్థానిక డీఎంకె ఎమ్మెల్యే కె.కృష్ణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘు మృతి విషయంలో ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో ప్రతిపక్ష పార్టీ పీఎంకె సైతం ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిందిగా సీఎం పళనిస్వామిని డిమాండ్ చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని పట్టుబడుతోంది.