మాఫియాతో లింకులున్న వారిని ఎమ్మెల్యే, ఎంపీలుగా చేసిందెవరు..?
మాఫియాను రాష్ట్రంలో అణగదొక్కేస్తామంటూ సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. మాఫియాతో సంబంధం ఉన్నవారిని ఎంపీ ఎమ్మెల్యేలను చేసిన ఘనత సమాజ్వాదీ పార్టీదని సీఎం యోగీ మండిపడ్డారు.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ శాసనసభలో సమాజ్వారీ పార్టీపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు.గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రతిపక్షనేత అఖిలేష్ యాదవ్కు సీఎం యోగీ చురుకలంటించారు. రామచరితమానస్ వివాదంపై సీఎం యోగీ ఘాటుగా స్పందించారు. ఓ పవిత్ర గ్రంథాన్ని చింపి తగులబెట్టారని అన్నారు. ఇది సనాతన ధర్మానికి అవమానం కాదా అని యోగీ ప్రశ్నించారు. పశువుల గురించి మాట్లాడేటప్పుడు భాష సరిగ్గా ఉండాలని సూచించారు. అవధిలో తులసీరాందాస్ రామచరితమానస్ను రచించారన్న యోగీ... వెనకబడిన వర్గాల వారు అనే పదం వచ్చిందంటే వారిపట్ల శ్రద్ధ వహించాలని అర్థమని యోగీ అన్నారు. వారికి సరైన విద్య అందేలా చూడాలని చెప్పారు. అంతేకాదు శూద్ర అనే పదానికి అర్థం ఒక వర్గం అని చెప్పారు. దళితుడిని శూద్రుడని పిలవకూడదని రాజ్యాంగరూపకర్త బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పారని సీఎం యోగీ గుర్తుచేశారు.
శనివారం రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉమేష్ పాల్ హత్యను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన సీఎం యోగీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ గూండాలను, మాఫియాలను ప్రోత్సహించింది ఎవరంటూ ప్రశ్నించారు. ఉమేష్ పాల్ కుటుంబం ఆరోపణలు చేస్తున్న అతీక్ అహ్మద్ వెంట ఉండి నడిపిందెవరని ప్రశ్నించారు. మాఫియాపై తమ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుందని గుర్తు చేసిన యోగీ ఆదిత్యనాథ్... ఒక మాఫియా ముఠాకు చెందినవారిని ఎంపీలు ఎమ్మెల్యేలుగా సమాజ్వాదీ పార్టీ చేయలేదా అని విమర్శించారు. వీరు అధికారంలోకి రాగానే దోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్నారని సీఎం మండిపడ్డారు.

తమ ప్రభుత్వం ప్రయాగరాజ్ ఘటనపై విచారణ చేస్తోందని, ఎవరైనా సరే ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదని యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనలో ఉన్న క్రిమినల్స్ను ఎదిగేందుకు సమాజ్వాదీ పార్టీ సహాయం చేసిందన్న మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. మాఫియాను అనగదొక్కేస్తామని సీరియస్గా హెచ్చరించారు. వీరంతా మాఫియాను ఒక పద్ధతిగా ప్రోత్సహిస్తున్నారంటూ సీఎం ఫైర్ అయ్యారు. ఎవరికైతే ప్రయాగరాజ్ ఘటనలో ప్రమేయం ఉందో వారంతా తప్పించుకుని తిరుగుతున్నారని వారిని పట్టుకుని తీరుతామని సీఎం వివరించారు. మాఫియాను అంతమొందించడమే తమ ధ్యేయం లక్ష్యమని సీఎం యోగీ ఆదిత్యనాథ్ సభలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications