ప్రొఫెసర్ ఎప్పుడయ్యారు?: ములాయంపై నితీష్ సెటైర్
పాట్నా: నిన్న మొన్నటి దాకా మేమంతా ఒక్కటే అన్న నాయకులు ఈరోజు తమ దారి తాము చూసుకున్నారు. అంతేగాక, ఒకరిపై ఒకరు విమర్శలు కూడా తీవ్రంగా చేసుకుంటున్నారు.
ఇటీవలే మహాకూటమి(జనతా పరివార్)గా ఏర్పడి విడిపోయిన సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురించే ఈ ఉపోద్ఘాతం. ప్రస్తుతానికి ఆర్డేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం ఆ కూటమిలోనే ఉన్నారు.
కాగా, లౌకికవాదానికి ములాయం సింగ్ యాదవ్ ప్రొఫెసర్ ఎప్పుడయ్యారు? ఆయణ్ని ఎవరు తయారు చేశారు? అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఆయన ప్రొఫెసర్ అయితే, తామంతా పరిశోధన విద్యార్థులమా? అని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.
మంగళవారం ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'ములాయం లౌకిక వాద విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయితే, మేమంతా రీసెర్చ్ స్కాలర్సా' అని ప్రశ్నించారు.
ఇది ఇలా ఉండగా, గతవారం ఓ కార్యక్రమంలో ములాయం మాట్లాడుతూ.. నితీష్పై విమర్శలు కురిపించారు. పరోక్షంగా నితీశ్ కుమార్ను ఉద్దేశించి.. ‘ఎవరు లౌకికవాది? పన్నేండుళ్లుగా బిజెపి మద్దతు తీసుకొని పరిపాలన సాగించిన వీరు లౌకిక వాదులా? అదేంటో ఒక్కసారిగా వారంతా లౌకికవాదులుగా మారారు' అంటూ ధ్వజమెత్తారు. ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని తాజాగా నితీశ్ ఎదురు దాడికి దిగారు.