అసలు నిర్భయ ఎవరు? ఢిల్లీలో ఆమెకు ఏం పని?: సీఎంఓ చుట్టూ సరికొత్త వివాదం..!
లక్నో: దేశ రాజధానిలో ఆరుమంది కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురైన పారామెడికల్ విద్యార్థిని నిర్భయ గురించి తెలియని వారెవరూ ఉండరు. ఏడేళ్ల కిందట చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కామాంధుల చేతుల్లో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన నిర్భయను కించపరిచేలా వ్యాఖ్యానించారు ఓ ప్రధాన వైద్యాధికారి (సీఎంఓ). అసలు నిర్భయ ఎవరు? ఢిల్లీలో ఆమెకేం పని? అంటూ ఎదరు ప్రశ్నలు వేశారు.
పూర్వీకుల గ్రామంలో ఘోర అవమానం..
ఉత్తర ప్రదేశ్లోని బలియా సమీపంలోని మడావరా కలా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రధాన వైద్యాధికారి పేరు డాక్టర్ ప్రీతమ్ కుమార్ మిశ్రా. నిర్భయ తండ్రి స్వస్థలం అది. నిర్భయ పూర్వీకులు అక్కడే నివసిస్తున్నారు. నిర్భయ హత్యోదంతం అనంతరం ఆమె స్మారకార్థం మడావరా కలా గ్రామంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ప్రీతమ్ కుమార్ మిశ్రా ఆ ఆసుపత్రిలో పని చేస్తున్నారు.ఈ ఆసుపత్రిలో చాలాకాలం నుంచీ డాక్టర్ల నియామకం జరగట్లేదు. ఉన్న వారు కూడా అరకొరగా విధులను నిర్వర్తిస్తున్నారు.

డాక్టర్ల కోసం ధర్నా చేస్తే..
ఇదే విషయంపై నిర్భయ తాత, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం సీఎంఓను కలిశారు. ఆ సమయంలో ఆయన ఆసుపత్రికి ఇంకా రాలేదు. అక్కడి సిబ్బంది కూడా వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనితో నిర్భయ తాత, ఆయన వెంట ఉన్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. నిరసనలకు దిగారు. ఆసుపత్రి సీఎంఓ, ఇతర సిబ్బందికి నిరసనగా నినాదాలు చేశారు.

ఢిల్లీలో నిర్భయకు ఏం పని? అంటూ..
అదే సమయంలో ప్రీతమ్ కుమార్ మిశ్రా ఆసుపత్రికి చేరుకున్నారు. ధర్నాకు దిగిన నిర్భయ తాత, ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో గొడవ పడ్డారు. ఒక్కరు కూడా డాక్టర్ చదవని గ్రామంలో ఆసుపత్రిని కట్టడమే పెద్ద విషయమని, ఇక డాక్టర్లను గురించి మాట్లాడొద్దని అన్నారు. దీనికి బదులిస్తూ.. తన మనవరాలు నిర్భయ డాక్టర్ చదవడానికి ఢిల్లీ వెళ్లిందని, అది పూర్తి చేయకముందే అత్యాచారానికి గురైందని చెప్పారు. దీనిపై ఆగ్రహించిన ప్రీతమ్ కుమార్ మిశ్రా.. అసలు నిర్భయ ఎవరు? వైద్య విద్యను చదవాలనుకుంటే ఢిల్లీకే వెళ్లాల్సిన అవసరం ఉందా? ఆమెకు ఢిల్లీలో ఏం పని? అంటూ నిలదీశారు.

పోలీసులకు ఫిర్యాదు..
ప్రీతమ్ కుమార్ వ్యాఖ్యలతో గ్రామస్తులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఆయనను ఘెరావ్ చేశారు. దాడికి ప్రయత్నించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఆయనను పక్కకు తీసుకెళ్లారు. వైద్య విద్యను పూర్తి చేసి, స్వగ్రామంలో క్లినిక్ను నెలకొల్పాలని నిర్భయ కలలు కన్నారని, అది తీరకుండానే కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తాన్నీ కదిలించిన నిర్భయ ఘటన గురించి తనకు తెలియదని డాక్టర్ వ్యాఖ్యానించడాన్ని తప్పు పట్టారు. ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications