ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం... మోడీ, అమిత్ షాపై చెలరేగిపోయిన రాహుల్
‘‘బీజేపీ ఓ అబద్ధాల పుట్ట, గుజరాత్ మోడల్ ఓ పచ్చి అబద్ధం, గబ్బర్ సింగ్ మోడల్ (జీఎస్టీ), నోట్ల రద్దు నిర్ణయం, మోడీ, అమిత్షా చెప్పేవీ, చేసేవీ అన్నీ అబద్ధాలే..’’ అంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ అగ్రనాయకత్వంపై నిప్పులు చెరిగారు. ''బీజేపీ ఓ అబద్ధాల పుట్ట, గుజరాత్ మోడల్ ఓ పచ్చి అబద్ధం, గబ్బర్ సింగ్ మోడల్ (జీఎస్టీ), నోట్ల రద్దు నిర్ణయం, మోడీ, అమిత్షా చెప్పేవీ, చేసేవీ అన్నీ అబద్ధాలే అంటూ మండిపడ్డారు.
రాహుల్ అధ్యక్షతన తొలి సీడబ్ల్యూసీ భేటీ.. హాజరైన సోనియా, మన్మోహన్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేత్వత్వంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగియగానే ఆయన నేరుగా మీడియాతో మాట్లాడారు.
బీజేపీపై.. ప్రధానంగా నరేంద్ర మోడీ, అమిత్షాపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఒకొటొక్కటిగా రుజువవుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు.
''నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ టాక్స్, రఫేల్ డీల్ ఇలా.... బీజేపీ చెబుతున్నవన్నీ అబద్ధాలే. గుజరాత్ మోడల్ అభివృద్ధి అంతకంటే బూటకం. రఫేల్ ఒప్పదం మారిపోయింది. ఈ ఒప్పందంతో ఓ వాణిజ్యవేత్తకు రివార్డు ఇచ్చారు. విధానాలు పాటించలేదు. ఇదేమిటని అడిగితే ప్రధాని మోడీ ఒక్క ప్రశ్నకూ జవాబివ్వలేదు..'' అని రాహుల్ ధ్వజమెత్తారు.
అంతేకాదు, ''బీజేపీ అధ్యక్షుడు అమిత్షా కుమారుడు రూ.50,000 పెట్టుబడి పెడితే అది మూడు నెలల్లో రూ.80 కోట్లు అయింది, అదెలా అని అడిగితే జవాబుండదు.. రఫేల్ ఒప్పందంపై, అమిత్షా కొడుకు సంపాదనపై ఎందుకు ప్రధాని మోడీ మౌనంగా ఉండిపోతున్నారు..'' అని ప్రశ్నించారు.
విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పిస్తానని, రూ.15,000 చొప్పున దేశంలోని ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని మోడీ ప్రజలను నయవంచనకు గురిచేశారని అసలు బీజేపీ ఫౌండేషనే అబద్ధాల పుట్ట అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 2జీ కేసులో వచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ... నిజం ఏమిటో మీరే చూశారు... దేశ ప్రజలందరూ తెలుసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.