రెండు స్థానాల్లో అగ్రనేతలు ఎందుకు పోటీచేస్తున్నారు..? వచ్చేదేంటి... పోయేదేంటి..?
దేశంలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజెస్కు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏయే నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయాలో అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. ఇక అగ్రనేతలు కూడా బరిలో నిల్చుంటున్నారు. అగ్రనేతలు మాత్రం రెండు స్థానాల్లో పోటీచేస్తున్నారు.. ? గెలుపుపై ధీమా ఉంటే రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేయాల్సి వస్తోంది..? వారు చెబుతున్న కారణాలేంటి... అసలైన కారణాలేంటి..?

రెండు స్థానాల్లో అగ్రేతల పోటీ
దేశంలో ఓ వైపు ఎండలు సెగ తగులుతుంటే.... మరోవైపు రాజకీయ సెగ కూడా అంతే స్థాయిలో ఉంది. పార్టీలు నేతలు తమ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇక అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో కూడా కొందరు అగ్రనేతలు రెండు స్థానాల్లో పోటీచేస్తున్నారు. అయితే వీరు రెండు స్థానాల నుంచి ఎందుకు పోటీచేస్తున్నారనేదానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అన్న కోసమే పవన్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 2009లో పార్టీ పెట్టి తొలిసారిగా ఎన్నికలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ... నాడు పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీచేశారు. అయితే సొంత ఊరి ప్రజలు చిరంజీవిని తిరస్కరించగా... రాయలసీమ ప్రజలు అక్కున చేర్చుకుని మంచి విజయాన్ని చిరుకు అందించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇక 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో జనసేనాని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. తొలుత తిరుపతి, గాజువాక నుంచి పోటీ చేస్తారనే వార్త ప్రచారం జరిగినప్పటికీ ఆయన గాజువాకతో పాటు భీమవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలవనున్నారు. తన అన్నయ్య నాగబాబు ఎంపీగా పోటీచేస్తున్న నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం కిందే భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది. పవన్ ఒకవేళ భీమవరం నుంచి పోటీ చేస్తే నాగబాబు గెలుపునకు కృషి చేసిన వారవుతారని అందుకే ఏరికోరి భీమవరం నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపారని ఓ వర్గం వారు చెబుతున్నారు. అయితే చిరంజీవినే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు తిరస్కరించారని ... నాగబాబుకు ఆమోదం తెలుపుతారని తామనుకోవడం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

వారణాసితో పాటు బెంగళూరు సౌత్ నుంచి మోడీ పోటీ..;?
2014 సార్వత్రిక ఎన్నికల్లో నాటి ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం వడోదర, ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేశారు. రెండిట్లోను విజయం సాధించిన మోడీ ఆ తర్వాత వడోదర సీటుకు రాజీనామా చేసి వారణాసి సీటును అలాగే ఉంచుకున్నారు. వడోదర పార్లమెంటు స్థానం నుంచి మోడీ రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 5,70,128 ఓట్ల మెజార్టీతో మోడీ విజయం సాధించారు. ఈ సారి ప్రధాని మోడీ మాత్రం మళ్లీ వారణాసి నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. అంతేకాదు బెంగళూరు సౌత్ నుంచి కూడా ప్రధాని మోడీ పోటీచేసే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాల్లో వార్త ప్రచారంలో ఉంది.

వాయనాడ్ నుంచి రాహుల్ ఎందుకు పోటీ చేస్తున్నారు..?
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడూ అమేథీ నుంచి పోటీచేస్తారు. కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కంచుకోట అమేథీతో పాటు కేరళ రాష్ట్రం వాయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. అమేథీలో రాహుల్ ఎలాగూ విజయం సాధిస్తారనేది నగ్న సత్యం. అయితే కేరళలోని వాయనాడ్ నుంచి ఎందుకు పోటీచేస్తున్నారనేదానిపైనే స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలను విస్మరిస్తోందంటూ కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందు పర్చింది. అయితే దక్షిణాది రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ చేయడం ద్వారా కాంగ్రెస్ దక్షిణాది రాష్ట్రాలను విస్మరించడం లేదనే సంకేతాలు పంపుతున్నారు. అంతే కాదు ఇప్పటికే అక్కడ శబరిమలై సమస్య నడుస్తోంది. హింసను ఆర్ఎస్ఎస్ ప్రోత్సహిస్తోందని చెబుతూ తాము అధికారంలోకి వస్తే అన్ని చక్కబెడుతామనే సంకేతాలు కాంగ్రెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ అమేథీ, వాయనాడ్లలో గెలుపొందితే... అమేథీ స్థానంకు రాజీనామా చేసి అక్కడ ప్రియాంకా గాంధీని నిలబెట్టే అవకాశాలు ఉన్నాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
మొత్తానికి అగ్రనాయకులు రెండు స్థానాల్లో పోటీ చేయడం చాలా ఆసక్తి కరంగా మారింది. కాలం కలిసి రాక రెండు చోట్ల ఓడిపోతే వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇలాంటి అగ్రనేతలు ఒక్క చోట ఓడిపోయినా వారి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆరే అని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications