నాకు సీఎం పోస్ట్ ఆఫర్ చేశారు కదా: కేజ్రీకి బేడీ, కశ్మీర్లో పీడీపీ-బీజేపీ!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీలు వాగ్భాణాలు సంధించుకుంటున్నారు. కిరణ్ బేడీ బీజేపీలో చేరడాన్ని ఏఏపీ ప్రశ్నించింది. దీనిపై బేడీ స్పందించారు.
తాను బీజేపీకి అనుకూలంగా ఉన్నానని తెలిసినప్పుడు కేజ్రీవాల్ తనను ఆమ్ ఆద్మీ పార్టీలో ఎందుకు చేరమన్నారని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. బీజేపీకి తాను అనుకూలంగా ఉంటానని తెలిసి 2013 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ముఖ్యమంత్రి పదవిని ఎందుకు ఆఫర్ చేశారని ప్రశ్నించారు.
లోక్పాల్ ఉద్యమం సమయంలే అన్నా హజారే టీం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా కిరణ్ బేడీ ప్రయత్నాలు చేశారని, ఆమె బీజేపీకి అనుకూలంగా ఉంటారని ఏఏపీ నేత కుమార్ విశ్వాస్ అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు.
జమ్మూ కాశ్మీర్లో బీజేపీ - పీడీపీ ప్రభుత్వం!
జమ్మూ కాశ్మీర్లో బీజేపీ, పీడీపీ ప్రభుత్వం ఏర్పడవచ్చుని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం నాడు సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటారు. పార్టీ సీనియర్ నేత రామ్ మాధవ్ ఈ భేటీలో పాల్గొని, అందరి నిర్ణయాలు తీసుకుంటారు.
బీజేపీ - పీడీపీ ప్రభుత్వం ఏర్పడాలంటే పీడీపీ పెట్టే పలు షరతులకు బీజేపీ అంగీకరించవలసి ఉంటుందని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి, సంక్షేమం కోసం తాను బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యామమని పీడీపీ నేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అన్నారు.