ఇంత ఆలస్యమేంటి? వీగిపోవడం ఖాయం, అందుకే ఇలా.., : ‘అవిశ్వాసం’పై అమిత్ షా
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా తొలిసారి స్పందించారు. ఎన్డీఏకు 300కు పైగా సభ్యుల మెజారిటీ ఉందని, మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని చాలా సునాయాసంగా ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు.
'అవిశ్వాస తీర్మానాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు పెడుతున్నారు? మేము అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నిబంధనల ప్రకారం సభలో చర్చ జరగాల్సి ఉంటుంది. ఓటింగ్ అంటూ జరిగితే సభలో ఓడిపోతామని కాంగ్రెస్, ఇతర పార్టీలకు బాగా తెలుసు. అందుకే సభను సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారు..' అని అమిత్షా ఆరోపించారు.

ఒకప్పుడు ఇందిరాగాంధీ వెర్సస్ ఇతరులుగా ఎన్నికల పోరు ఉండేదని, ఇప్పుడు పరిస్థితులు మారాయని, మోడీ ఒక ఎత్తయితే, ప్రతిపక్షాలన్నీ కలిపితే ఒక ఎత్తుగా 2019 ఎన్నికల పోరు ఉంటుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విందు సమావేశంపై కూడా అమిత్షా తనదైన శైలిలో స్పందించారు.
వారు (కాంగ్రెస్) విందు సమావేశం జరిపితే, తాము మాత్రం నేరుగా ప్రజలతోనే మమేకమవుతుంటామని అన్నారు. అత్యంత విజయవంతమైన దేశ ప్రధానిపై మరోసారి నమ్మకాన్ని చూపుతారా? ఆరంజ్ తరహా కూటమికి ఓటేస్తారా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.
పార్టీ బూత్ మేనేజ్మెంట్లో బీజేపీ బలాన్ని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్జే కూడా ఏఐసీసీ ప్లీనరీలో గుర్తుచేశారని, 2019 ఎన్నికల గెలుపుపై కాంగ్రెస్ కలలు కల్లలేనని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ 2014లో కంటే అధిక సీట్లతో గెలుపొందుతుందని కూడా అమిత్షా ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications