పాస్ పోర్టులపై కమలం గుర్తు: విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెబుతోందంటే..!
న్యూఢిల్లీ: కొత్తగా జారీ చేస్తోన్న పాస్ పోర్టులపై విదేశాంగ మంత్రిత్వ శాఖ కమలం గుర్తును ముద్రించడం దుమారానికి దారి తీస్తోంది. కమలం- భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు. దీన్ని పాస్ పోర్టులపై ముద్రించడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రస్తావించింది. పాస్ పోర్టలను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాషాయమయం చేస్తోందంటూ ఆ పార్టీ సభ్యులు విమర్శించారు. దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది.
జాతీయ గుర్తు అయినందువల్లే..
పువ్వుల్లో కమలం జాతీయ గుర్తు కావడం వల్లే దాన్ని పాస్ పోర్టులపై ముద్రించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్ కుమార్ వెల్లడించారు. ఒక పార్టీ ఎన్నికల గుర్తుగా తాము కమలాన్ని గుర్తించలేదని, జాతీయ గుర్తు కావడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని అన్నారు. నకిలీ పాస్ పోర్టులను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని వివరించారు. కమలం అనేది మొదట జాతీయ గుర్తుగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నకిలీ పాస్ పోర్టులను అరికట్టడానికి..
దేశంలో కొత్తగా జారీ చేస్తోన్న పాస్ పోర్టులన్నింటికీ కమలం గుర్తును అధికారికంగా ముద్రిస్తున్నామని అన్నారు. నకిలీ పాస్ పోర్టులు పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వాటిని అరికట్టడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) నిబంధనలకు అనుగుణంగా కొత్తగా జాతీయ గుర్తును ముద్రించాల్సి వచ్చిందని చెప్పారు.
కోజికోడ్ లో తొలిసారిగా..
కేరళలోని కోజికోడ్ లో తొలిసారిగా ఈ తరహా పాస్ పోర్టు వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు ఎంకే రాఘవన్ అన్నారు. కోజికోడ్ స్థానానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన నియోజకవర్గంలో కొత్తగా జారీ చేస్తోన్న పాస్ పోర్టులన్నింటిపైనా కమలం ముద్ర ఉందనే విషయాన్ని ఆయన లోక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. జీరో అవర్ లో దీన్ని ప్రస్తావించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అన్నింటినీ కాషాయమయం చేస్తోందని విమర్శించారు.