రాహుల్ ఏం చెప్పదలుచుకున్నారు.. అంతా అయిపోయాక సింధియాపై ఇలా.. దాని అర్థమేంటి?
డిసెంబర్,2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జరుగుతున్న రోజులవి. అలాంటి తరుణంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో రాహుల్కు ఒకవైపు కమల్నాథ్,మరోవైపు జ్యోతిరాధిత్య సింధియా ఉన్నారు. ఆ ఫోటోకు జతగా ప్రముఖ రచయిత లియో టాల్స్టాయ్ కోట్ 'సహనం,సమయం.. ఈ రెండు అత్యంత శక్తివంతమైన యోధులు' కూడా చేర్చారు. అప్పట్లో ఆ కొటేషన్తో.. ఆ ఫోటోతో.. రాహుల్ ఏం చెప్పదలుచుకున్నారో చాలామందికి అర్థం కాలేదు. తాజాగా అదే పోస్టును మరోసారి ఆయన ట్వీట్ చేయడం గమనార్హం.

ప్రత్యక్షంగా విమర్శించలేకనే..
కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరిన ప్రస్తుత తరుణంలో రాహుల్ గాంధీ గతంలో చేసిన ఆ ట్వీట్ను తాజాగా రీట్వీట్ చేశారు. అంటే,సింధియాకు సమయం కోసం వేచి చూసే ఓపిక లేదని రాహుల్ పరోపక్షంగా చెప్పదలుచుకున్నారా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడు.. ఏ సమయంలోనైనా తన ఇంట్లోకి నేరుగా రాగలిగేంత సాన్నిహిత్యం ఉన్నవాడు గనుకే.. ప్రత్యక్షంగా విమర్శించలేక సింధియాపై ఇలా పరోక్ష విమర్శ చేశారేమోనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ఆ డైలామా కంటే...
రాహుల్ రీట్వీట్ చేసిన కొద్దిసేపటికే జ్యోతిరాధిత్య సింధియాకు బీజేపీ నుంచి రాజ్యసభ టికెట్ ఖరారైంది. రాహుల్ మాటల్లో సింధియాకు సహనం లేదన్న విమర్శ కనిపిస్తోంది. కానీ సింధియా మాత్రం రాహుల్ అపాయింట్మెంట్ కోసం గత ఆర్నెళ్లుగా ఎన్నోసార్లు ప్రయత్నించి.. ఇక నమ్మకం లేకనే బీజేపీలో చేరడానికి సిద్దమైనట్టు చెబుతున్నారు. తమతో మాట్లాడేందుకు ఇష్టం లేకపోతే పార్టీలో ఎందుకు చేర్చుకున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్లో రాజ్యసభ సీటు దక్కుతుందో లేదోనన్న డైలామా కంటే బీజేపీలో చేరి రాజ్యసభ సీటుతో పాటు భవిష్యత్తులో కేంద్రమంత్రి పదవి దక్కించకోవడం ఉత్తమం అని సింధియా భావించినట్టు తెలుస్తోంది.

రాహుల్ ట్వీట్పై సింధియా వర్గం ప్రశ్న..
రాహుల్ చేసిన ట్వీట్పై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సమయం,సందర్భం కోసం వేచి చూడాలనే కాన్సెప్ట్ సరైందే కానీ.. తెగేదాకా లాగితే ఇలాంటి పర్యవసానాలే ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. సింధియా విషయంలో రాహుల్ గానీ అధిష్టానం గానీ సరైన సమయంలో స్పందించి ఉంటే ఇంత డ్యామేజీ జరిగేది కాదని పరిశీలకులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తన ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తున్నారన్న అసంతృప్తిలో కూరుకుపోయిన సింధియాకు అధిష్టానం నుంచి చిన్న భరోసా ఇచ్చినా పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. దీన్నిబట్టి సమయం,సహనం గురించి తెలుసుకోవాల్సింది సింధియానా.. లేక రాహుల్ గాంధీనా అన్నది సింధియా వర్గం నుంచి తలెత్తే ప్రశ్న.
Recommended Video


మొత్తానికి బీజేపీ గూటికి..
మొత్తానికి సింధియా కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వెళ్లారో లేదో రాజ్యసభ ఖరారైపోయింది. భవిష్యత్తులో కేంద్రమంత్రి పదవి కూడా దక్కవచ్చు. ప్రస్తుతం రాజ్యసభలో మధ్యప్రదేశ్ నుంచి 11 స్థానాలు ఉన్నాయి. మార్చి 26న జరిగే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే రెండు స్థానాల్లో కాంగ్రెస్,బీజేపీలకు చెరో స్థానం దక్కుతుంది. మరో స్థానం కోసం రెండు పార్టీలు పోటీపడనున్నాయి.












Click it and Unblock the Notifications