బడ్జెట్..బ్లడ్ బాత్: కొన్ని గంటల్లో రూ.3.6 లక్షల కోట్లు ఆవిరి: షేర్ మార్కెట్ భారీ పతనం..ఎందుకు?
ముంబై: సాధారణంగా కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెడుతోందంటే షేర్ మార్కెట్ కళకళలాడుతుంటుంది. ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత దాని ప్రభావం కొద్దో, గొప్పో పడుతుంది. సాధారణ స్థాయిలో ఉత్థాన, పతనాలు నమోదవుతుంటాయి. అది ఆనవాయితీగా చెబుతుంటారు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం కనిపించింది. బడ్జెట్ ప్రసంగం ఆరంభ సమయంలోనే నేల చూపులు చూసిన మార్కెట్ గ్రాఫ్.. ఏకంగా పాతాళానికి పడిపోయింది.
11 సంవత్సరాల తరువాత తొలిసారిగా..
స్టాక్ మార్కెట్ గ్రాఫ్ ఈ రేంజ్లో దిగజారడం 11 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. పైగా అది బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టే రోజే కావడం మార్కెట్ వర్గాలను దిగ్భ్రాంతిలోకి ముంచెత్తింది. కొన్ని గంటల వ్యవధిలో సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లను కోల్పోవడం అంటే మాటలు కాదు. 40 వేల మార్క్ కంటే దిగజారింది. నిఫ్టీది అదే దుస్థితి 50 పాయింట్లను కోల్పోయిన నిఫ్టీ 11,700 మార్క్ వద్ద నిలిచిపోయింది.
రూ.3.6 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి..
దిగజారిన సెన్సెక్స్.. షేర్ హోల్డర్ల ఆదాయాన్ని ఆవిరి చేసింది. బడ్జెట్ డే నాడే 3.6 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయ్యాయి. శనివారం ఉదయం 3,46,256.76 కోట్ల రూపాయల వద్ద ఆరంభమైన మార్కెట్ లావాదేవీలు.. సాయంత్రానికి 1,53,04,724.97 కోట్ల రూపాయల వద్ద నిలిచిపోయింది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో నమోదైన ఈ అంకెలు స్టాక్ మార్కెట్ ఏ స్థాయిలో పడిపోయిందనడానికి అద్దం పట్టాయి.
ఈ స్థాయిలో పతనానికి కారణాలేంటీ..?
ఆర్థిక రంగాన్ని పురోగమింపజేయడానికి బడ్జెట్లో చెప్పుకోదగ్గ ప్రతిపాదనలేవీ పొందుపరచలేదని, దాని ప్రభావం- ఈక్విటీ మార్కెట్పై పడిందని ఆనంద్ రాఠీ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజాన్ హజ్రా అభిప్రాయపడ్డారు. కొత్తగా ప్రతిపాదించిన వ్యక్తిగత ఆదాయపు పన్ను విధానం కూడా దుష్ప్రభావాన్నే చూపిందని, పొదుపు ఖాతలపై దీని ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.
నో ఎల్టీసీజీ అండ్ ఎస్టీటీ..
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (ఎల్టీసీజీ), సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ ట్యాక్స్ (ఎస్టీటీ).. ఈ రెండింటినీ బడ్జెట్లో ప్రతిపాదిస్తారని మార్కెట్ వర్గాలు భావించాయి. వారు తలంచిది ఒకటైతే.. కేంద్రం మరొకటి తలచినట్టయింది. ఈ రెండింటి ఊసే ఎత్తలేదు కేంద్రం ప్రభుత్వం. ఎల్టీసీజీని ప్రవేశ పెట్టింది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. 2016లో అప్పటి ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చే రిటర్న్లను ఎల్టీసీజీగా పరిగణిస్తారు మార్కెట్ వర్గాలు.
డీడీటీ విధానాన్ని రద్దు చేయడం కూడా..
డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) విధానాన్ని తొలగించాలని బడ్జెట్లో ప్రతిపాదించడం కూడా మార్కెట్ పతనానికి దారి తీసినట్టయిందని అంటున్నారు విశ్లేషకులు. డీడీటీని తొలగించడం విదేశీ పెట్టుబడిదారులకు మాత్రమే లబ్ది కలుగుతందని, షేర్ హోల్డర్లు మాత్రం తమ వద్ద ఉన్న డివిడెండ్, ఈక్విటీలపై పన్నును చెల్లించాల్సి ఉంటుందని ఐఐఎఫ్ ఛైర్మన్ నిర్మలా జైన్ వెల్లడించారు.
షేర్ హోల్డర్లకు రెండుసార్లు పన్నులు..
ఓ కంపెనీ షేర్లను కొనుగోలు చేసిన షేర్ హోల్డర్లను కూడా సదరు కంపెనీలో వాటాదారులుగా ఉంటారని, కంపెనీకి వచ్చే లాభాలపై షేర్ హోల్డర్లు పన్నును చెల్లిస్తారని అన్నారు. డీడీటీని రద్దు చేయడం వల్ల రెండుసార్లు పన్నులను చెల్లించాల్సిన పరిస్థితిని షేర్ హోల్డర్లు ఎదుర్కొంటారని నిర్మలా జైన్ విశ్లేషించారు. డీడీటీని రద్దు చేస్తామంటూ నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రస్తావించడం మార్కెట్కు ఏ రకంగా కూడా మంచిది కాదని అన్నారు.
షేర్ హోల్డర్లపై 43 శాతం పన్నులు
డీడీటీని రద్దు చేయడం వల్ల షేర్ హోల్డర్లపై పన్ను పోటు 10 నుంచి 43 శాతానికి పెరుగుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ సీజే జార్జ్ అభిప్రాయపడ్డారు. భారత్లోని ప్రైవటు కంపెనీలన్నీ అత్యధిక శాతం ప్రమోటర్ల మీదే ఆధారపడి నడుస్తుంటాయని. అలాంటి ప్రమోటర్లు, షేర్ హోల్డర్లకు డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయంపై ఇప్పటిదాకా 10 శాతాన్ని పన్నుగా చెల్లిస్తున్నారని అన్నారు. డీడీటీని రద్దు చేయడం వల్ల ఈ శాతం 43కు చేరుతుందని చెప్పారు.
బ్యాంకింగ్ షేర్లపైనా దుష్ప్రభావం..
డిపాజిటర్ల బీమా కవరేజీని లక్ష రూపాయల నుంచి అయిదు లక్షల రూపాయలకు పెంచడం వల్ల బ్యాంకింగ్ షేర్లపై దుష్ప్రభావాన్ని చూపిందని జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ అండ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ హెచ్ కే ప్రధాన్ తెలిపారు. అదనపు భారాన్ని భరించుకోవడానికి ఏ బ్యాంకర్ కూడా సిద్ధంగా ఉండరని అన్నారు. ఫలితంగా- నిఫ్టీలో బ్యాంకింగ్ సెక్టార్ పాయింట్లను భారీగా కోల్పోయిందని ఆయన తెలిపారు.