Viral Video : లోక్ సభలో ధరల చర్చ-2 లక్షల బ్యాగ్ ను దాచేసిన మహిళా ఎంపీ-ఎందుకంటే ?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి. ఈ 12 రోజుల్లో లోక్ సభలో కానీ, రాజ్యసభలో కానీ చెప్పుకోదగిన బిల్లులు కానీ, అర్ధవంతమైన చర్చలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. కానీ చిత్ర విచిత్రమైన ఘటనలు మాత్రం చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటిదే ఓ ఘటన నిన్న లోక్ సభలో జరిగింది. ఈ వీడియో ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోక్ సభలో ధరల పెరుగుదలపై చర్చకు డిమాండ్ చేస్తూ వారం రోజులుగా విపక్ష ఎంపీలు లోక్ సభతో పాటు రాజ్యసభలోనూ కేంద్రాన్ని పట్టుబడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. దీంతో విపక్షాల నిరసనలు కూడా పెరుగుతూ పోయాయి. ఇదే సమయంలో నిరసనలకు దిగుతున్న నలుగురు కాంగ్రెస్ ఎంపీల్ని లోక్ సభ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయినా నిరసనలు ఆగలేదు. దీంతో కేంద్రం నిన్న ఆ నలుగురు ఎంపీలపై సస్పెన్షన్ ను ఉపసంహరించుకుని ధరల పెరుగుదలపై చర్చ చేపట్టింది. అయితే ఇందులో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా నిన్న జరిగిన చర్చలో లోక్ సభలోనే ఉన్నారు. ధరల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో తన పక్కనే ఉన్న మరో మహిళా ఎంపీ నిలబడి మాట్లాడుతున్నారు. అదే సమయంలో పక్కనే కూర్చుని ఉన్న మహువా మొయిత్రా ఏదో ఆలోచిస్తున్నారు. అంతలోనే తన తోటి ఎంపీలు ఆమెకు సైగ చేశారు. దీంతో వెంటనే ఆమె తన 2 లక్షల విలువైన లూయిస్ వుట్టన్ టోట్ బ్యాగ్ ను కింద దాచేశారు. అప్పటివరకూ తన పక్కనే ఉన్న బ్యాగ్ ను మహువా మొయిత్రా ఎందుకు దాచేశారన్న చర్చ లోక్ సభ ఎంపీల్లో వినిపించింది. ఇప్పుడు అదే వీడియో ట్విట్టర్ తో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతోంది.
As the issue of "mehengai" is raised, somebody's Louis Vuitton bag quickly slides under the bench. pic.twitter.com/Rtra8qsBEt
— Ajit Datta (@ajitdatta) August 1, 2022
లోక్ సభలో ధరల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో అప్పటివరకూ దీనిపై చర్చ కోరిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తన విలాసవంతమైన బ్యాగ్ కనిపిస్తే ఎక్కడ అధికారపక్షం ఆమెను టార్గెట్ చేస్తుందని భావించారో లేక పక్కనే ఉన్న ఇతర ఎంపీలు ఆమెను అలర్ట్ చేశారో తెలియదు కానీ ఆమె మాత్రం వెంటనే దాన్ని దాచేశారు. ఈ దృశ్యాలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి.