అమిత్ షా.. శవ రాజకీయాలు చాలించు -హాత్రస్ హత్యాచారంపై నోరు విప్పలేదేం?: బెంగాల్ సీఎం మమత ఎదురుదాడి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ ప్రచారం నేటితో ముగియనుండగా, ఓ వృద్ధురాలి మృతిపై తీవ్ర వివాదం చలరేగడం, దానిపై ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించడం, టీఎంసీ సర్కారుకు ఉసురు తగులుతుందని తిట్టిపోయడం సంచలనంగా మారింది. అయితే బీజేపీ కార్యకర్త తల్లి అయిన ఆ వృద్ధురాలి మరణంపై విచారం వ్యక్తం చేస్తూనే, శవరాజకీయాలు తగవంటూ షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎదురుదాడికి దిగారు.
మాజీ సీఎం వల్ల దేశ భద్రతకు ముప్పు -సీఐడీ సంచలన రిపోర్ట్ -పాస్పోర్ట్ నిరాకరణ -మోదీపై ముఫ్తీ ఫైర్
టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో మంగళవారంతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో సోమవారం ఆమె భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. సుదీర్ఘ పాదయాత్రతోపాటు బహిరంగ సభ నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి వృద్ధురాలి మృతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో దానిపై మమత స్పందించారు.
''బీజేపీ కార్యకర్త తల్లిగా చెబుతోన్న 82ఏళ్ల సోదరి ఎలా చనిపోయారో నాకు తెలీదు. ఏ రూపంలో జరిగినా హింసకు నేను పూర్తిగా వ్యతిరేకం. అలాంటి చర్యలకు మన పార్టీలో తావు లేదు. అయితే ఆమె మరణాన్ని టీఎంసీకి అంటగడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా తప్పుడు ప్రచారానికి తెరలేపారు. బెంగాల్ మహిళాలోకాన్ని బీజేపీనే కాపాడుతుందని ఆయన చెప్పుకుంటున్నారు. అయ్యా అమిత్ షా.. ఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ లో మహిళపై హత్యాచారం జరిగినప్పుడు యావత్ దేశం ఖండించింది. నాటి ఘటనపై మీరు నోరు విప్పలేదేం?'' అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ కొత్త పార్టీ! -జగన్తో వైఎస్ షర్మిల ఒప్పందం -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలనం
ఎన్నికల వేళ శాంతి భద్రతల అంశం ఈసీ పరిధిలో ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఎన్నికల హింసలో టీఎంసీనే నష్టపోయిందని, గడిచిన కొద్ది రోజుల్లో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలను చంపేశారని మమత అన్నారు. నందిగ్రామ్ పరిధిలో నివసించే ఓ బీజేపీ కార్యకర్త తల్లిపై గత నెలలో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఆ 82ఏళ్ల వృద్ధురాలు సోమవారం కన్నుమూశారు. టీఎంసీ కార్యకర్తల దాడిలోనే ఆమె గాయపడినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. సీఎం మమత మాత్రం షా వాదన తప్పని అన్నారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 1న రెండో దశ పోలింగ్ జరుగనుంది.