పెళ్లిలో డ్యాన్స్ చేయలేదని.. భార్యపై ఓ భర్త ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే!
పెళ్లిలో భాగంగా 'కలేవా' అనే తంతు జరుగుతుండగా.. భర్త అజయ్ ఆమెను డ్యాన్సు చేయాల్సిందిగా కోరాడు. తనతోను, అతిథులతోను కలిసి డ్యాన్స్ చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడు.
కాన్పూర్: పెళ్లి వేడుకల్లో తనతో పాటు డ్యాన్స్ చేయలేదని ఓ తాగుబోతు భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా భార్యను మేడ మీద నుంచి కిందకి తోసేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ మహిళ.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లా చిల్లాఘాట్ పట్టణం సమీపంలోని డిఘ్వాట్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. డిఘ్వాట్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు విశాఖ అనే మహిళ తన భర్త అజయ్ తో కలిసి వెళ్లింది. పెళ్లిలో భాగంగా 'కలేవా' అనే తంతు జరుగుతుండగా.. భర్త అజయ్ ఆమెను డ్యాన్సు చేయాల్సిందిగా కోరాడు. తనతోను, అతిథులతోను కలిసి డ్యాన్స్ చేయాల్సిందిగా ఒత్తిడి చేశాడు. విశాఖ ఇందుకు నిరాకరించడంతో.. తీవ్ర ఆగ్రహావేశంతో ఆమెను భవనం పైనుంచి కిందకు తోసేశాడు.

ఘటనలో బాధితురాలి రెండు కాళ్లు విరిగిపోయాయి. తల, ఉదరభాగంలో గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సదరు భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications