భార్య చీరలే ఉరి తాళ్లు: ఒక్క రాత్రిలో నాశనమైన కుటుంబం!
బీహార్లోని ముజఫర్పూర్లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు కూతుళ్లను ఉరేసి.. ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదుగురు పిల్లలను ఉరి తీయడానికి ప్రయత్నించినా.. అదృష్టవశాత్తూ అతడి ఇద్దరు కొడుకులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. అమర్నాథ్ను ఈ తీవ్ర నిర్ణయం తీసుకునేలా చేసిన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఒక్కరాత్రిలోనే కుటుంబం నాశనం
ఈ హృదయవిదారక సంఘటన ముజఫర్పూర్ పరిధిలోని మిస్రౌలియా గ్రామంలో జరిగింది. అమర్నాథ్ భార్య సుమారు ఏడాది క్రితం మరణించినట్లు సమాచారం. అప్పటి నుండి అతను తన ముగ్గురు కూతుళ్లు అనురాధ (12), శివాని (7), రాధిక (6), ఇద్దరు కొడుకులు శివం (6), చందన్ (5) తో కలిసి జీవిస్తున్నాడు.

ఈ ఘటనకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భార్య మరణం తర్వాత ఐదుగురు పిల్లలను చూసుకోవడానికి అమర్నాథ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని కొందరు స్థానికులు చెబుతున్నారు. మరికొందరు అతను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి అప్పు తీసుకుని, దాన్ని తిరిగి చెల్లించాలని ఒత్తిడికి గురవుతున్నాడని అంటున్నారు. అయితే హత్యకు, ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని, క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి వెల్లడించారు.
విందు తర్వాత విషాదం
ఈ దారుణానికి ముందు వంటగదిలో పగిలిన గుడ్ల పెంకులు లభించాయి. దీనిని బట్టి అమర్నాథ్ తన పిల్లలకు గుడ్లు వండి తినిపించిన తర్వాతే ఈ ఘోరానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అమర్నాథ్ తన ఐదుగురు పిల్లలను ఒక పెట్టెపై నిలబడమని చెప్పాడు. ఆ తర్వాత వారి మరణించిన తల్లికి చెందిన చీరలతో ఉరి ఉచ్చులను తయారు చేసి, వాటిని పిల్లల మెడకు బిగించాడు. తర్వాత తన మెడకు కూడా ఉరి ఉచ్చును బిగించుకున్నాడు. అనంతరం ఆ పెట్టెపై నుంచి కిందకు దూకమని పిల్లలందరిని ఆదేశించాడు. తాను కూడా అదే చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఆ ఇద్దరు కొడుకులు(శివం, చందన్) దూకకుండా తప్పించుకున్నారు. దాంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆరేళ్ల శివం చెప్పిన వివరాల ప్రకారం, తను తండ్రి ఫోన్తో ఆడుకుంటున్నప్పుడు, తండ్రి తనను, తన సోదర/సోదరీమణులను తనతో రమ్మని చెప్పాడని, ఆ తర్వాతే ఈ ఘోరం జరిగిందని తెలిపాడు.












Click it and Unblock the Notifications