ఆమ్లెట్లో టమాట వేయలేదని భార్యను చితకబాదాడు
ఈ ఘటన బుధవారం సాయంత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలు ఫర్జానా మౌ పోలీస్ స్టేషన్లో తన భర్త షఫీక్పై ఫిర్యాదు చేసింది. వివాహమైన నాటి నుంచి తనను కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆమె ఫిర్యాదు ప్రకారం.. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన షఫీక్.. తన కోసం ఓ ఆమ్లెట్ వేయమని భార్య ఫర్జానాకు చెప్పాడు. ఆమె ఆమ్లెట్ వేసుకుని అతనికి తెచ్చి ఇచ్చింది. అయితే అందులో టమాట వేయడం ఆమె మరిచిపోయింది. తనకు ఇష్టమైన టమాట లేకుండా ఆమ్లెట్ ఎందుకు వేశావని ఆగ్రహానికి గురైన షఫీక్.. ఫర్జానాను తీవ్రంగా కొట్టాడు.
ఈ విషయాన్ని ఖర్గోన్లోని ఆమె తల్లిదండ్రులకు ఫర్జానా తెలిపింది. దీంతో హుటాహుటిని మౌకు చేరుకున్న ఫర్జానా తల్లిదండ్రులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపిసి సెక్షన్లు 498, 323, 294, 506, 34 కింద నిందితుడు భర్తతోపాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షఫీక్ తోపాటు అతని సోదరుడు సబీక్, సోదరి సేనా, తల్లి గుల్తాజ్, తండ్రి రఫీక్లపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.