‘సుప్రీం తీర్పు తర్వాతే రామమందిర నిర్మాణంపై నిర్ణయం’
అలహాబాద్: అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా వెల్లడించారు. రామమందిర నిర్మాణంపై తమ పార్టీ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశారు.
‘సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకూ మేం ఎదురుచూడాలి. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా మేం నిర్ణయం తీసుకుంటాం. మందిర నిర్మాణంపై బిజెపి వ్యూహాల్లో ఎలాంటి మార్పూ లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలోనే మేం ముందుకు వెళ్తాం'అని ఆయన వివరించారు.
రామమందిరంపై ప్రధాని మౌనం వీడి, ఒకసారి అయోధ్యను దర్శించాలని కోరారు. మోడీ దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.. అలాగే అయోధ్యను కూడా దర్శించాలని కోరుతున్నట్లు మిశ్రా తెలిపారు.
మత పెద్దల భావోద్వేగాలను అర్థం చేసుకుంటాం.. కానీ, ఏదైనా ప్రధాని తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. ‘మోడీ అయోధ్యను ఖచ్చితంగా దర్శిస్తారు. శ్రీరాముడిని ప్రార్థిస్తారు' అని చెప్పారు. రామ మందిర నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.