నవజ్యోత్ సింగ్ సిద్ధు దేశానికి ముప్పు, సీఎం కానివ్వను: అమరీందర్ సింగ్, రాహుల్, ప్రియాంకలపై ఇలా
ఛండీగఢ్: పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధుపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూను సీఎంను కానివ్వబోమని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని ఖచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేశారు.
సిద్ధూ ప్రమాదకరమైన వ్యక్తి అని, ఆయనతో దేశ భద్రతకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. సిద్ధూపై బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెడతామన్నారు. సిద్ధూతో పంజాబ్ రాష్ట్రానికే కాదు, దేశానికే ప్రమాదమని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాకు అంతగా అనుభవం లేదని, వారి సలహాదారులు వారిని తప్పుదోవపట్టిస్తున్నారంటూ అమరీందర్ సింగ్ చెప్పుకొచ్చారు. రాహుల్, ప్రియాంక తన పిల్లల్లాంటివారేనని చెప్పారు. ముగింపు ఇలా ఉండాల్సింది కాదన్నారు. తాజా పరిణామాలతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యేలను గోవాకో, ఇంకే ప్రాంతానికో విమానంలో తీసుకెళ్లే పని తనకు చేతకాదని, జమ్మిక్కులు చేయడం తెలియదని అమరీందర్ సింగ్ తెలిపారు. తన గురించి గాంధీ కుటుంబానికి బాగా తెలసని చెప్పారు. సిద్ధూ.. దేశ భద్రతకు ముప్పు అని, అందుకే ఆయన్ను పంజాబ్ ముఖ్యమంత్రిని కానివ్వకుండా అడ్డుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను నవజ్యోత్ సింగ్ సిధ్దూకు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం.. ఆ తర్వాత అమరీందర్ సింగ్ను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు చరణ్ జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనకు ఇప్పటికే చాలా అవమానాలు ఎదురయ్యాయని, ఇక తాను భరించలేనని సీఎం పదవికి రాజీనామా చేసినట్లు అమరీందర్ సింగ్ తెలిపారు.
తాను తన రాజీనామాను మూడు వారాల ముందుగానే సోనియా గాంధీకి పంపానని.. అయితే, ఆమె తనను సీఎంగా కొనసాగాలని కోరారని చెప్పారు అమరీందర్ సింగ్. ఆమె రాజీనామా చేయమంటే తాను చేసేవాడినని తెలిపారు. తాను ఓ సైనికుడినని.. అవసరమైన సమయంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని అమరీందర్ సింగ్ తెలిపారు.
Recommended Video
తన రాజకీయ భవిష్యత్తుపై తన శ్రేయోభిలాషులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు అమరీందర్ సింగ్ తెలిపారు. త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన అమరీందర్ సింగ్ ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications