కాంగ్రెస్ కు హ్యాండిచ్చినట్టే? మా మేనిఫెస్టోను అమలు చేస్తేనే..మద్దతు: దుష్యంత్: తీహార్ జైలుకు వెళ్లి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో.. జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ ఆశలు అడియాసలయ్యాయి. తాము ఏ పార్టీకి కూడా ఇప్పుడిప్పుడే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు గానీ, భారతీయ జనతాపార్టీకి గానీ మద్దతు ఇవ్వట్లేదని అన్నారు. తమ డిమాండ్లకు అంగీకరించిన పార్టీకి మాత్రమే మద్దతు ఇవ్వాలని తీర్మానించినట్లు వెల్లడించారు. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను అమలు చేయడానికి ముందుకొచ్చే పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు.
ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం: నాడు బీజేపీ ధర్నా..నేడు మద్దతు కోసం! సూపర్ పవర్ గా చెప్పులషాపు ఓనర్
శాసన సభా పక్ష భేటీలో తర్జన భర్జన
శుక్రవారం దేశ రాజధానిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జన్ పథ్ లోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలతో పాటు ప్రజల అభీష్టానికి అనుగునంగా పరిపాలన సాగించే పార్టీకి మాత్రమే మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. ఈ సమావేశం అనంతరం దుష్యంత్ చౌతాలా.. పార్టీ ముఖ్య నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
రెండు పార్టీలకూ సమ దూరం..
ఫలానా పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై తాము ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమని తేల్చేశారు. ఈ రెండు పార్టీలకు సమాన దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాము జన్ నాయక్ జనతా పార్టీని ఏర్పాటు చేశామని, పార్టీ విధానాలను అనుగుణంగానే వెళ్తామని అన్నారు. పార్టీని నెలకొల్పిన 10 నెలల కాలంలోనే 10 మంది శాసన సభ్యులను హర్యానా ప్రజలు తమకు అందించారని, తమను ఆదరిస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు.
యువత.. వ్యవసాయం..
ప్రజలకు అనుకూలంగా పరిపాలన సాగించే పార్టీలకు మద్దతు ఇస్తామని, కాంగ్రెస్ లేదా బీజేపీ అనే తేడా చూడబోమని దుష్యంత్ చౌతాలా చెప్పారు. స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నప్పటికీ.. కొత్త సర్కార్ లో తాము కీలక పాత్ర పోషించబోతున్నామని అన్నారు. అది ఏ రకంగా అనేది కొద్దిరోజుల్లో తేటతెల్లమౌతుందని దుష్యంత్ చౌతాలా పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా యువత అకాంక్షలకు అనుగుణంగా ఉపాధి కల్పనా చర్యలను చేపట్టాలని, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని, దీనికి సరైన హామీ ఇచ్చిన పార్టీతో కలిసి వెళ్తామని అన్నారు.
తీహార్ జైలుకు..
హర్యానా నుంచి ఈ ఉదయం దేశ రాజధానికి చేరుకున్న దుష్యంత్ చౌతాలా.. నేరుగా తీహార్ జైలుకు వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన తండ్రి అజయ్ చౌతాలా తీహార్ జైలులో ఉన్నారు. ఆయనను కలుసుకున్నారు. తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా.. జన్ పథ్ లోని నివాసానికి చేరుకున్నారు. పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆయన వెంట జేజేపీకి చెందిన పలువురు నాయకులు ఉన్నారు. నివాసానికి చేరుకున్న వెంటనే పలువురు అభిమానులు, జేజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికారు.