వ్యాన్ దిగని ఎంపి, ఈడ్చేసిన పోలీసులు: దీదీపై ఫైర్
కోల్కతా: శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసులో నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కునాల్ ఘోష్ పోలీసులకు తీవ్రమైన ఇబ్బందులు కల్పించారు. కోర్టులో ప్రవేశ పెట్టేందుకు పోలీసులు బుధవారం ఆయన్ని వ్యాన్లో తీసుకొచ్చారు. అయితే ఇదే కేసులో నిందితుడైన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మదన్ మిత్రకు కల్పించిన సదుపాయాలే తనకూ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
అప్పటి వరకు పోలీసు వ్యాన్ దిగేది లేదని మొరాయించారు. దీంతో పోలీసులు ఆయన్ని బలవంతంగా వ్యాన్ నుంచి కిందికి ఈడ్చుకొచ్చారు. మదన్ మిత్ర ప్రత్యేక కారులో కోర్టుకు వచ్చేందుకు, ఫోన్లో మాట్లాడేందుకు పోలీసులు అనుమతించారు. తనను కూడా అలానే పరిగణించాలని కునాల్ డిమాండ్ చేశారు. కునాల్ను టీఎంసీ ఇప్పటికే పార్టీ నుంచి బహిష్కరించింది.

కాగా, మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కునాల్ ఘోష్ డిమాండ్ చేశారు. శారదా కుంభకోణంలో పాలు పంచుకున్నవాళ్లందరినీ అరెస్టు చేస్తే తప్ప న్యాయం జరగదని ఆయన అన్నారు. మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తేనే తనకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
తాను ఈ నెల 30వ తేదీన సిబిఐ ముందు హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని తృణమూల్ కాంగ్రెసు నేత ముకుల్ రాయ్ చెప్పారు. శారదా కుంభకోణం కేసులో ఆయనకు సిబిఐ తమ ముందు హాజరు కావాలని సిబిఐ సమన్లు జారీ చేసింది.












Click it and Unblock the Notifications