అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే బంగారు ఇటుక ఇస్తా: షాజహాన్ మనవడు
హైదరాబాద్: రామ జన్మభూమి అయిన అయోధ్యలో రామమందిరం నిర్మాణం చేపడితే తాను బంగారు ఇటుక(గోల్డ్ బ్రిక్) సమర్పిస్తానని మొఘల్ వంశ వారసుడు ప్రిన్స్ యాకుబ్ హబీబుద్దిన్ తుసి వ్యాఖ్యానించారు. అయోధ్య రామమందిరం అంశం చాలా ఏళ్లుగా కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొఘల్ వారసుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
'ఒక వేళ అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడితే మేము నిర్మాణం కోసం బంగారు ఇటుకను అందజేస్తాం. తమ వాదన వింటుందని ఆశిస్తున్నాం' అని ఏఎన్ఐతో ప్రిన్స్ యాకుబ్ తెలిపారు.
'1529 సంవత్సరంలో ఆ మసీదు నిర్మించబడింది. అది కూడా ఆర్మీ, కమాండోల కోసం నిర్మించింది కాబట్టి.. అది ప్రైవేట్ ప్రాపర్టీనే. మేము ఆ భూమికి న్యాయబద్ధమైన యజమానులం. అంతేగాక, 2005లో సుప్రీంకోర్టు కూడా తాను షాజహాన్ మనవడినని అంగీకరించింది' అని ప్రిన్స్ యాకుబ్ వెల్లడించారు.
ఒక వేళ తనకు ఆ భూమిపై యాజమాన్య హక్కులను సుప్రీంకోర్టు కల్పించినట్లయితే.. తాను ఆ భూమిని భారత ప్రభుత్వానికి అందజేస్తానని ప్రిన్స్ యాకుబ్ స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తే తాను ఆ నిర్మాణానికి బంగారు ఇటుకను సమర్పించుకుంటానని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, సోమవారం రోజు ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలోని జస్టిస్ ఎస్ఏ బోబ్డే అందుబాటులో లేకపోవడంతో రామజన్మభూమి-బాబ్రీ మసీదు టైటిట్ సూట్ వాదనలు వినలేకపోయారు. కాగా, జస్టిస్ బోడ్డే అస్వస్థత కారణంగానే అందుబాటులో లేరని కోర్టు వర్గాల ద్వారా తెలిసింది. ఆగస్టు 6 నుంచి డే-బై-డే బేసిస్ ప్రకారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు వాదనలు వింటోంది.