రేసుగుర్రం మోడీ, లిస్ట్ నుండి రాహుల్ ఔట్: రాష్ట్రంలో..!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీ గెలుపుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయట. ప్రధాని పదవి రేసులో మోడీ, రాహుల్గాంధీ ఉన్నారు. మోడీ పైన ఎక్కువగా బెట్టింగ్లు కాస్తున్నారట. మోడీ గెలుపు ఖాయమైందనే ఊహాగానాలు, ప్రచారం నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బుకీలు రాహుల్ గాంధీని బెట్టింగ్ జాబితా నుండి తీసేశారట కూడా!
కాబోయే ప్రధాని ఎవరనే దానిపై కొద్దిరోజుల నుంచి భారీగా బెట్టింగ్ సాగుతోందట. గల్లీ మొదలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు గ్యాంగ్లు బెట్టింగ్ రాకెట్ను నడిపిస్తున్నాయి. బెట్టింగ్ కట్టే ముందు సర్వేల మీద మాత్రమే ఆధారపడకుండా.. స్థానికంగా ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాలుచేస్తున్నారట.
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బెట్టు కట్టేవారి సంఖ్య పెరుగుతోందట. మోడీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఇది వరకే సర్వేల్లో తేలడంతో ఆయన్ను నమ్ముకునే అధిక మొత్తంలో బెట్టింగ్ కాస్తున్నారట. ప్రధానితో పాటు ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతోన్న ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో సిఎం పదవి ఎవరు చేపడతారనేదాని పైనా బెట్టింగ్ జోరుగా సాగుతోందట.
మోడీ ప్రధాని కావడం ఖాయమని బెట్టింగ్ రాయుళ్లు చాలా వరకు నమ్ముతున్నారు. అందుకే మోడీ మీద ఎక్కువ డబ్బు ఇచ్చేందుకు బుకీలు సిద్ధంగా లేరట. ములాయం సింగ్ యాదవ్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి వారి మీద పెద్ద మొత్తంలో ఇస్తున్నారట.
ప్రధాని రేసులో మోడీ టాప్లో ఉండగా, పార్టీల రేసులో బిజెపి ముందుంది. బిజెపికి సొంతంగా 200 సీట్లు వస్తాయని బెట్టింగ్ కాస్తున్నారట. అలాగే ఎన్డీయే 200, 225, 250 సీట్ల గెలుపు పైనా కూడా బెట్టింగ్ కాస్తున్నారట. ఇక కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందట.
మన రాష్ట్రం విషయానికి వస్తే సీమాంధ్ర ప్రాంతంలో టిడిపి, జగన్ పార్టీల పైన పోటాపోటీగా పందేలు కడుతున్నారట. 175 సీట్లకుగాను 90 సీట్లు తమ పార్టీకే వస్తాయంటూ ఇరు పార్టీల అభిమానులూ పందేలు కాస్తున్నారట. తెలంగాణలో తెరాస, కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ ఉందట.