సిద్ధరామయ్యను సీఎం చేస్తే రాజీనామాలు వెనక్కి తీసుకుంటాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల డిమాండ్
బెంగళూరు : కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ సర్కార్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. తాము కుమారస్వామి ప్రభుత్వంలో పనిచేయబోమని స్పష్టంచేశారు. తమ రాజీనామా వెనక్కి తీసుకోవాలంటే .. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి సీఎంగా ఉండాలని కుండబద్దలు కొట్టారు. అయితే దీనిపై జేడీఎస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
డిమాండ్లివే ..
కాంగ్రెస్ పార్టీకి చెందిన సోమశేఖర్, బసవరాజు, శివరాం .. సిద్ధరామయ్యను సీఎం చేస్తే తమ రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టంచేశారు. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి గానీ, ఇటు జేడీఎస్ నుంచి గానీ స్పందన రాలేదు. మరో ఎమ్మెల్యే మునిరత్న తన పదవీకి రాజీనామా చేయలేదు .. కానీ పార్టీపై కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా వేగంగా స్పందిస్తోంది. మిత్రపక్షం జేడీఎస్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు కాంగ్రెష్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ .. సాయంత్రం 6 గంటలకు సిద్ధరామయ్యతో సమావేశం కానున్నారు. తాను సీఎం పదవీ చేపట్టనని .. ఆ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పి .. రాజకీయ అస్థిరతను నుంచి తాత్కాలికంగా విరమించే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో .. సిద్ధరామయ్య బెంగళూరు చేరుకున్నారు. కావేరిలోని తన నివాసంలో అందుబాటులో ఉన్నట్టు ప్రకటించారు.

హుటహుటిన
ఇటు కర్ణాటక సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు తెలిసి ఆగమేఘాల మీద ఇండియా బయల్దేరారు. షెడ్యూల్ ప్రకారం ఆయన సోమవారం రావాల్సి ఉంది. కానీ మారిన రాజకీయ పరిస్థితులతో రెండురోజుల ముందుగానే భారత్ వచ్చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్ అత్యవసరంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో వీరు సాయంత్రం భేటీ కానున్నారు. అమెరికా నుంచి కుమారస్వామి వచ్చేలోపు సిచుయేషన్ను తమకు అనుకూలంగా తీసుకునేందుకు శతవిధలా ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications