బీజేపీకి 300కుపైగా సీట్లు ఖాయం: యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి అమిత్ షా
అమరావతి: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తమదే విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం రాష్ట్రంలోని కాస్గంజ్ లో జన్ విశ్వాస్ యాత్ర ర్యాలీ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం ఖాయమని అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300కుపైగా స్థానాలు దక్కించుకుంటామని అమిత్ షా వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలు, 2017 ఎన్నికలు, 2019 ఎన్నికల్లో బీజేపీని రాష్ట్ర ప్రజలు ఆదరించారన్నారు. ఈ సందర్భంగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ(బీఎస్పీ), అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)లపై విమర్శలు గుప్పించారు. ఒక పార్టీ కులానికి సంబంధించిందైతే.. మరో పార్టీ కుటుంబానికి చెందినదన్నారు.
యూపీ ప్రజలు కుల, కుటుంబాలకు చెందిన పార్టీలను దూరం పెడుతున్నారని అన్నారు అమిత్ షా. 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. యూపీ ప్రజలు అభివృద్ధి చేసిన పార్టీకే ఓటేస్తారన్నారు.
ఉత్తర ప్రదేశ్ మొత్తం అసెంబ్లీ స్థానాలు 403 కాగా.. 2022లో వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో 300లకు పైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని అమిత్ షా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోనే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. మోడీ హయాంలో సబ్కా సాత్ సబ్ కా వికాస్ జరుగుతుందని అమిత్ షా పేర్కొన్నారు.
రాష్ట్రంలో గత పాలకుల కాలంలో తల్లిదండ్రులు తమ కూతుళ్లను పాఠశాలలకు పంపించేందుకు భయపడేవారని అమిత్ షా అన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రాష్ట్రంలో రక్షణ పెరిగిందన్నారు. మహిళల సంక్షేమం కోసం, రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు అమిత్ షా. తాము అధికారంలోకి వస్తే రామమందిర నిర్మాణాన్ని నిలిపివేస్తామని అఖిలేష్ యాదవ్ అంటున్నారని.. అది ఆయనకు కలగానే మిగులుతుందని ఎద్దేవా చేశారు.
కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లలో 300 కంటే ఎక్కువ మెజారిటీతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2014 లోక్సభ ఎన్నికలలో, 2019లో 80 నియోజకవర్గాల్లో 73, 67 స్థానాలు గెలుచుకుంది.