ఎయిర్ ఫోర్స్ డే: మిగ్-21ను నడిపించిన యుద్ధ వీరుడు
లక్నో: త్రివిధ దళాల్లో కీలకమైనదిగా భావించే వైమానిక దళం మంగళవారం 87వ వార్షికోత్సవ దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోంది. పాకిస్తాన్ పై భారత్ ఇప్పటిదాకా చేసిన రెండు సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించినది వైమానిక దళమే. సరిహద్దులను దాటుకుని మన దేశ గగనతలంలోకి చొచ్చుకుని వచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను తరిమి కొట్టిన వైమానిక దళ అధికారులు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో ఎయిర్ షోను నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్.. మిగ్-21 బైసన్ ను నడిపించారు.
ఈ వార్షికోత్సవ వేడుకలకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, వైమానిక దళాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భడూరియా తదితరులు హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్ డే పరేడ్ లో అన్ని రకాల యుద్ధ విమానాల విన్యాసాలను ప్రదర్శించారు.
అభినందన్.. పాక్ చేతికి చిక్కడానికి వైమానిక దళ తప్పిదాలే కారణమా?
ప్రత్యేకించి- పాకిస్తాన్ లోని బాలాకోట్ పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్న విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన అభినందన్.. మిగ్-21 బైసన్ విమానాన్ని నడిపించారు. ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తరిమి కొట్టినప్పటి సాహస కృత్యాలను గుర్తు చేశారు.
ఈ ఎయిర్ షో పరేడ్ లో మిగ్-21 బైసన్ తో పాటు మిరేజ్-2000 రకానికి చెందిన మూడు విమానాలు, రెండు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల విన్యాసాలు కట్టి పడేశాయి. బాలాకోెట్ పై నిర్వహించిన వైమానిక దాడులు అంచనాలకు మించి రాణించాయని ఎయిర్ చీఫ్ మార్షల్ భడూరియా చెప్పారు. యుద్ధ విమానాలు జార విడిచిన బాంబులు గురి తప్పలేదని, లక్ష్యాన్ని ఛేధించాయని అన్నారు. వైమానిక శక్తి సామర్థ్యాలేమిటో బాలాకోట్ దాడులతో అటు పాకిస్తాన్ కు, ఇటు ప్రపంచ దేశాలకు తెలియజేశామని చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాలు సైతం రాబోతున్నాయని, వాటి వల్ల వాయుసేనకు అదనపు బలం చేకూరుతుందని అన్నారు.