ఇది బీజేపీ వర్సెస్ పాటిదార్ల పోరు: నేడు సూరత్లో హార్దిక్ బైక్ ర్యాలీ.. బీజేపీ నేతలను పర్మిషన్ పాస్
సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పాటిదార్ల అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ ఆదివారం సూరత్ పట్టణంలో భారీగా 5000 మోటార్ బైక్లతో బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించనున్నారు. 30 కిలోమీటర్ల దూరం సాగే ఈ రోడ్ షో, బహిరంగ సభ నిర్వహణ కోసం ఇప్పటికే పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే పాటిదార్ సంస్థలు మాత్రం పోలీసులు అనుమతినిచ్చినా, ఇవ్వకున్నా రోడ్ షో నిర్వహించడం గ్యారంటీ అని హెచ్చరిస్తున్నాయి. 'జనక్రాంతి మహా ర్యాలీ' పేరుతో పాస్ ఈ ర్యాలీ నిర్వహిస్తోంది. సూరత్ పట్టణం పాటిదార్ల జనాభాకు పెట్టింది పేరు. బైక్ ర్యాలీ ముగింపుగా వరచ్చా ప్రాంతంలోని యోగి చౌక్లో బహిరంగ సభ నిర్వహించాలని పాస్ తలపోసింది.

రాహుల్
గత నెల మూడో తేదీన వరచ్చా చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన హార్దిక్ పటేల్.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితే పాటిదార్లు ఓటమి పాలైనట్లేనని తేల్చేశారు. ఈ క్రమంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాస్ కార్యకర్తలు, అధికార బీజేపీ కార్యకర్తలకు మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి.

ఆరు సెగ్మెంట్ల మీదుగా రోడ్ షో ఇలా
ఉదయం తొమ్మిది గంటలకు కటార్గాం వద్ద గజేరా సర్కిల్లో ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ ప్లస్ రోడ్ షో రాత్రి తొమ్మిది గంటలకు యోగి చౌక్ వద్ద బహిరంగ సభగా మారుతుంది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రోడ్ షో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పాస్ సూరత్ సహా కన్వీనర్ అల్పేశ్ కథేరియా తెలిపారు. కటార్గాం, సూరత్ నార్త్, కరాంజ్, వరచ్చా, కామ్రేజ్, ఒల్పాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగే రోడ్ షోలో 5000 మోటర్ బైక్లు. 500కి పైగా కార్లు, 50 ఆటో రిక్షాలు పాల్గొంటాయి. ఈ నియోజకవర్గాల్లో అత్యధికంగా పాటిదార్లు నివాసం ఉంటారు. రోడ్ షో సందర్భంగా హార్దిక్ పటేల్పై రాసిన పాటలు వినిపిస్తారు.

బీజేపీ అభ్యర్థులను అనుమతించబోమన్న పాస్
వాహనాల ర్యాలీలో 30 వేల మందికి పైగా పాల్గొంటారని అంచనా వేస్తున్నామని అల్పేశ్ కథేరియా తెలిపారు. యోగి చౌక్లో జరిగిన సభలో లక్ష మందికి పైగా బహిరంగ సభలో పాల్గొంటారని అంచనా వేస్తున్నామని చెప్పారు. రోడ్ షో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హార్దిక్ పటేల్కు సన్మానం చేస్తారని చెప్పారు. ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అక్కడికి చేరుకున్నా అనుమతించబోమని కథేరియా తేల్చి చెప్పారు. ఇది పాటిదార్లకు, బీజేపీకి మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు.
హార్దిక్ పటేల్ ప్రచారంలో పాల్గొనాలని పాస్ సోషల్ మీడియా, ఇతర మీడియా సంస్థల ద్వారా పాస్ ప్రచారం చేస్తొంది.

అరెస్ట్ అయ్యేందుకైనా సిద్ధమైనని పాస్ వెల్లడి
రోడ్ షో, బహిరంగ సభల నిర్వహణకు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేశామని, ఒకవేళ అనుమతి ఇవ్వకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు. ఒకవేళ అనుమతి ఇవ్వకుండా రోడ్ షో ప్రారంభించడానికి ముందే అరెస్ట్ చేసినా అందుకు సిద్ధమేనని అల్పేశ్ కథేరియా వివరించారు.
పాస్ ర్యాలీకి అనుమతినిస్తామని సూరత్ నగర పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మ తెలిపారు. అయితే ఆ సంస్థ నాయకులతో మాట్లాడి ర్యాలీ కుదించాల్సిందిగా కోరతామని, తద్వారా ట్రాఫిక్ నియంత్రణకు వీలవుతుందన్నారు. ఎటువంటి అభ్యంతరకర ప్రకటనలు చేయొద్దని వారిని కోరతామని చెప్పారు.












Click it and Unblock the Notifications