పక్కా తమిళుడినే, రాజకీయాలను మార్చేద్దాం: తేల్చేసిన రజినీ, స్వామికి కౌంటర్
తాను తమిళుడినేనని దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. తాను కర్ణాటక నుంచి వచ్చినా.. మీ(అభిమానుల) అభిమానంతో తనను పూర్తిగా తమిళుడిగా గొప్ప స్వాగతం పలికారని చెప్పారు.
చెన్నై: తాను తమిళుడినేనని దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. తాను కర్ణాటక నుంచి వచ్చినా.. మీ(అభిమానుల) అభిమానంతో తనను పూర్తిగా తమిళుడిగా గొప్ప స్వాగతం పలికారని చెప్పారు. రజనీకాంత్ కొద్దిరోజులుగా తన అభిమానులతో ప్రాంతాల వారీగా సమావేశమవుతున్న సంగతి తెలిసిందే.
రజినీకాంత్పై బిజెపి దెబ్బ: చిద్దూ ఫ్యామిలీపై ఐటి దాడులు?
చివరి రోజైన శుక్రవారం తమ అభిమాన నటుడిని కలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. చెన్నైలోని కొడాంబక్కంలో తన అభిమానులను కలుసుకున్న సందర్భంగా రజినీకాంత్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.
రజినీ భావోద్వేగం
‘నేను కర్ణాటకలో 23ఏళ్లు ఉన్నాను, తమిళనాడులో 43ఏళ్లుగా నివసిస్తున్నాను. నేను కర్ణాటక వాడినైనా మీరు(అభిమానులు) నన్ను గొప్పగా స్వాగతించి నిజమైన తమిళుడిగా ఆదరించారు. నేనిప్పుడు పక్కా తమిళిడినే' అని రజినీ భావోద్వేగంతో అన్నారు.
వెళ్లిపోవడం కుదరదంటూ స్వామికి కౌంటర్
తనను తమిళనాడు నుంచి వెళ్లిపొమ్మంటున్నారని, అలా వెళ్లిపోయే ప్రసక్తే లేదని రజినీ స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామికి కౌంటర్లా ఉన్నాయి. ఇటీవల స్వామి మాట్లాడుతూ.. రజినీ అసలు తమిళుడే కాదని, బెంగళూరు నుంచి వచ్చిన మరాఠీ అని ఆయన వ్యాఖ్యానించారు.
మీడియా తరుముతోంది..
కాగా, తాను పక్కా తమిళుడినే అన్న రజినీ.. తాను ఏం మాట్లాడినా మీడియా తనను తరుముతోందని, సంచలనం చేస్తోందని, ఇందుకు రాజకీయాలే కారణమని అన్నారు. తాను ఎంతో క్రమశిక్షణతో ఉండటం వల్లే ఇలా ఉన్నానని చెప్పారు. ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చినప్పుడు తన గొంతు వినిపిస్తానని రజినీ స్పష్టం చేశారు. ‘మీతోపాటు నాక్కూడా బాధ్యతలు, పనులు ఉన్నాయి. ఇప్పుడవి చేద్దాం. కానీ, తప్పనిసరిగా పోరాటం వచ్చినప్పుడు మనం కలుద్దాం' అని చెప్పారు.
చెత్త రాజకీయాలను మార్చేద్దాం
‘ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. తమిళనాడులో మంచి నాయకులున్నా వ్యవస్థలో మార్పు రాలేదు'అని రజనీ అన్నారు. రాజకీయ వ్యవస్థ కుళ్లుబట్టిపోయిందని, దాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలని, అప్పుడే దేశం సరైన మార్గంలో ముందుకెళుతోందని రజినీ అన్నారు. కాగా, రజినీ వ్యాఖ్యలు గమనిస్తుంటే.. త్వరలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.
రజినీపై సుబ్రమన్యస్వామి ఇలా..
తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని రజనీకాంత్ చెప్పడంపై బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని ఆయన ఓ జోక్గా కొట్టిపారేశారు. రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. రజనీకాంత్కు స్పష్టమైన సిద్ధాంతం లేదని, గతంలో వేర్వేరు పార్టీలతో కలిశారని, తరుచుగా నిర్ణయాలు మార్చుకుంటారని ఆయన అన్నారు. రజనీకాంత్ విషయంలో తమిళ స్థానిక మనోభావాలను సుబ్రహ్మణ్యస్వామి వెలికి తీశారు. రజనీకాంత్ అసలు తమిళుడే కారని, బెంగళూరు నుంచి వచ్చిన మరాఠీ అని ఆయన వ్యాఖ్యానించారు. రజనీకాంత్ అభిమానులున్న మాట వాస్తవమేనని, అయితే వారు రజనీకాంత్ సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినవారు కారని, ఓ గంపులా రజనీకాంత్ను ఆరాధిస్తున్నారని ఆయన అన్నారు.
అమ్మ లేదు, కరుణ లేడు.. ఇక రజినీయే
తమిళనాడులో ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సమర్థవంతమైన నాయకుడు లేకపోవడంతో రాజకీయ పార్టీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అన్నాడీఎంకేకు జయలలిత మరణంతో దూరమైతే.. డీఎంకే పార్టీకి కరుణానిధి అనారోగ్య కారణంగా దూరమయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ బాధ్యతలు స్టాలిన్ చేపట్టినప్పటికీ పెద్ద ప్రభావమేమీ చూపలేదు. దీంతో రజినీ రాజకీయ అరంగేట్రమే తమిళనాడుకు ప్రత్యామ్నాయ మార్గమని రజినీ అభిమానులతోపాటు మెజార్టీ తమిళ ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. రజినీ తాజా ప్రకటనతో రజినీ రాజకీయ ప్రవేశం దాదాపు ఖరారైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం ఉండటంతోనే త్వరలోనే రజినీ తన రాజకీయ అరంగేట్రంపై ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.