మహా సంక్షోభం: 24 గంటల్లో పదవులు పోవడం ఖాయం, థాకరే పేరు వాడొద్దు: సంజయ్ రౌత్
షిండే.. ఇతర ఎమ్మెల్యేలకు శివసేన హెచ్చరికలు జారీచేస్తోంది. తిరిగి సొంతగూటికి రావాలని కోరుతుంది. లేదంటే మంత్రి పదవులు పోవడం ఖాయం అని వార్నింగ్ ఇస్తోంది. ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిన మంత్రులు 24 గంటల్లో పదవులు కోల్పోతారని ఆయన స్పష్టం చేశారు. రెబెల్ వర్గం మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తామని వెల్లడించారు.
చర్యలు తప్పవు..
షిండే నేతృత్వంలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారాన్ని సీఎం, శివసేన చీప్ ఉద్ధవ్ థాకరేకు కట్టబెడుతూ పార్టీ జాతీయ కార్యవర్గం తీర్మానం చేసింది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ ఆ విషయాన్ని మీడియాకు తెలిపారు. మరోవైపు, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ శత్రువులని, అలాంటి పార్టీలతో భాగస్వామ్యం మంచిది కాదని షిండే వర్గం ఎమ్మెల్యే చిమన్ రావు పాటిల్ స్పందించారు.
వారే ప్రత్యర్థులు
నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయని వివరించారు. ఆ పార్టీలతో పొత్తు సరికాదని కోరారు. సీఎం ఉద్ధవ్ థాకరే ఇకనైనా సహజసిద్ధ పొత్తు కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఉద్ధవ్ థాకరే నుంచి దీనిపై ఎలాంటి స్పందన లేదని చెప్పారు. దీనికి సంబంధించి ఏక్ నాథ్ షిండే తగిన నిర్ణయం తీసుకుంటారని పాటిల్ వెల్లడించారు.
బెట్టు దిగని నేతలు
ఇటు ఉద్దవ్, అటు షిండే బెట్టు దిగడం లేదు. దీంతో ఏకాభిప్రాయం కుదరడం లేదు. షిండే వర్గం ఎమ్మెల్యేలు గువహటిలోని హోటల్లోనే ఉన్నారు. ఆయన కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతుంది. కానీ అదీ ప్రాక్టికల్గా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలీ. అన్నీ లెక్కలు వేసుకున్నాకే పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారు. మరోవైపు సంజయ్ రౌత్.. షిండే.. అతని వర్గం ఎమ్మెల్యేలు బాల్ థాకరే పేరు వాడొద్దని సూచించారు.
బాధ లేదే
అంతకుముందు వర్షను వదిలి వెళుతున్నందుకు బాధపడటం లేదని సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు. ఇదీ తనది కాదని తనకు తెలుసు అని చెప్పారు. ఇదివరకు చాలా మంది కూడా అలాగే వెళ్లారని గుర్తుచేశారు. తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. తనతో శివ సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు కూటమికి మద్దతును ఉపసంహరించుకోలేదని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ తెలిపారు.